38 కేసులు: పేరు మోసిన గూండా అరెస్టు (ఫొటో)
హైదరాబాద్: సైబరాబాద్ పోలీసులు పేరు మోసిన గూండా, రౌడీ షీటర్ను అరెస్టు చేశారు. సైబారాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ ఓ ప్రకటనలో ఈ విషయం చెప్పారు. అతను 38 కేసుల్లో నిందితుడని ఆయన చెప్పారు. దోపిడీ, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, హత్యాప్రయత్నం, బలవంతపు వసూళ్లు, డ్రగ్స్, అల్లర్ల సృష్టి వంటి పలు కేసుల్లో అతను పాలు పంచుకున్నట్లు చెప్పారు.
వివరాలు ఇలా ఉన్నాయి - రంగారెడ్డి జిల్లాలోని మల్లాజిగిరికి చెందిన మొహమ్మద్ ముక్రమ్ అలియాస్ పప్పు అలియాస్ అక్రమ్ అనే రౌడీ షీటర్ను పీడియాక్ట్ కింద అరెస్టు చేశారు. గూండాయిజానికి, దారుణమైన నేరాలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి కూడా ప్రజలు భయపడే పరిస్థితి ఉంది.
అక్రమ్ను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు. మల్కాజిగిరిలోని అతన్ని అరెస్టు చేయడానికి తనకు సంక్రమించిన అధికారాలతో కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
ఓ ముఠాకు నాయకత్వం వహిస్తూ అతను ప్రమాదకరమైన, చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్నట్లు ఆనంద్ తెలిపారు. ప్రభుత్వాధికారులను కూడా బెదిరించినట్లు అక్రమ్పై ఆరోపణలున్నాయి. ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే అతనిపై 38 కేసులున్నాయి.