తీవ్ర వాయుగుండం: ఏపీ, తెలంగాణలో 28 నుంచి భారీ వర్షాలు
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. మరోవైపు, కాస్త ఎడతెరిపినిచ్చిన వర్షాలు.. మరికొద్ది రోజులపాటు కొనసాగనున్నాయి. అక్టోబర్ 28 రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక, మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఈ అల్పపీడనం వాయుగుండం, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 29 నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసిన క్రమంలో.. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈశాన్య రుతుపవనాల వర్షాలు ఆగ్నేయ భారతదేశ ద్వీపకల్పంలో అక్టోబర్ 29 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది ఇలావుండగా, సిత్రాంగ్ తుఫాను బంగ్లాదేశ్పై తీవ్ర ప్రభావం చూపింది. అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి.
తుఫాను ప్రభావంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఈదురుగాలులు, వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో పలు ప్రాంతాల్లో అంధకారంలోకి వెళ్లిపోయాయి. అనేక ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.
కాగా, సిత్రాంగ్ ప్రభావం భారత ఈశాన్య రాష్ట్రాలపైనా పడింది. అస్సాం, త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమబెంగాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో తుఫాను కారణంగా విమానాల రాకపోకలు కూడా ప్రభావితమయ్యాయి.