ఏపీపై సైక్లోన్ రోను ప్రభావం: భారీ వర్షాలు, ఒడిశా వైపు వాయుగుండం
విజయవాడ: రైతులంతా ప్రతిఏటా ఆసక్తిగా ఎదురు చూసే నైరుతి రుతుపవనాలు వచ్చాయి. సాధారణంగా జూన్ మొదటి వారం తర్వాత వచ్చే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే వచ్చాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి ఏప్రిల్ నెలల్లోనే ఎండల తీవ్రతను చవి చూశాం.
ఈ నేపథ్యంలో అంచనా కంటే ముందే నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశముందని అధికారులు చెప్పారు. ఈ క్రమంలో నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయని వాతావరణ శాఖాధికారులు బుధవారం తెలిపారు. మరో వారం రోజుల్లో ఈ రుతుపవనాలు కేరళను తాకనున్నాయని అధికారులు వెల్లడించారు.
గత కొన్ని వారాలుగా భరించలేని వేసవి తాపాన్ని అనుభవిస్తున్న జిల్లా వాసులను బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం 'రోను' తుపానుగా రూపాంతరం చెంది వణికించేలా చేస్తోంది. అది తీవ్రరూపం దాల్చి భయాందోళనలకు గురిచేస్తోంది. తుపాను ప్రభావంపై వాతావరణ హెచ్చరికలు సముద్రతీర ప్రాంత వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి.
బందరులో 3వ నంబరు ప్రమాద సూచికను జారీ చేయడంతో పాటు అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యల దిశగా చర్యలు చేపట్టింది. తుపాను ప్రభావంతో జిల్లాలో 50 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో గాలులు ఉండటంతో పాటు రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందంటున్నారు. మచిలీపట్నంలో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీవ్యాప్తంగా పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. తూగో జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రోను తుఫాన్ ప్రభావం కోస్తాంధ్ర పైన ఎక్కువ పడుతుందని అంటున్నారు.
చిత్తూరు జిల్లాలో చిరుజల్లులు కురుస్తున్నాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో బుధవారం గుంటూరు జిల్లా వర్షం కురిసింది. పలుచోట్ల రాత్రి నుంచి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశా దిశలో వెళ్తోంది. ఇది మరికొద్ది గంటల్లో వాయుగుండంగా మారనుంది.