బాబుతో సైరస్, రుణమాఫీపై జగన్పార్టీ, అవసరం లేదని..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ ఛైర్మన్ సైరన్ పీ మిస్త్రీ బుధవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటుపై వారు ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. ఏపీలో స్మార్ట్ సిటీల నిర్మాణానికి టాటా గ్రూప్ ముందుకొచ్చింది.
అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి సహకారం అందిస్తామని సైరస్ చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో కూడా సైరన్ మిస్ట్రీ సమావేశమయ్యారు.
అవసరం లేదన్న శైలజానాథ్
రుణమాఫీ కోసం ప్రభుత్వాలకు ఎవరి అనుమతి అవసరం లేదని మాజీ మంత్రి శైలజానాథ్ వేరుగా అన్నారు. బ్యాంకులకు రూ.40వేల కోట్లు చెల్లిస్తే రుణమాఫీ చేసుకోవచ్చునని చెప్పారు. 2004లో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెసు పార్టీదేనని చెప్పారు. ఇరు రాష్ట్రాల వివాదాల పైన కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. పదేళ్ల పాటు కామన్ ఎడ్యేకేషన్ ఉండాలని విభజన చట్టంలో ఉందని పేర్కొన్నారు.
శ్వేతపత్రం విడుదల చేయాలన్న వైయస్సార్ కాంగ్రెస్
ఏపీలో ఇంకా రుణమాఫీ అమలు కాలేకపోయినందున, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. రుణాల రీషెడ్యూల్ సాధ్యం కాదని రిజర్వు బ్యాంకు గవర్నర్ స్పష్టం చేశారని, రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రస్తుతం రైతులంతా నిరాశ నిస్పృహల్లో ఉన్నారన్నారు.