"పవన్ కల్యాణ్ తప్పు చేస్తున్నారు, లక్ష్మీపార్వతి తీసుకుంటారనే చంద్రబాబు అలా"
హైదరాబాద్: ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ రాజకీయ వేత్త, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. తాను తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నానని అంటూనే దాడి వీరభద్రరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ను అధికారం నుంచి దింపే సమయంలో జరిగిన పరిణామాలపై కూడా ఆయన మాట్లాడారు. తాను రాయబోయే పుస్తకంలో ఆ అంశాలు కూడా ఉంటాయని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలపై కూడా దాడి వీరభద్రరావు తనదైన విశ్లేషణ చేశారు. టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన దాడి వీరభద్ర రావు అందులో ఇమడలేక బయటకు వచ్చేశారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం వల్ల తాను నష్టపోయిన మాట నిజమేనని ఆయన అంగీకరించారు. 1982లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన దాదాపుగా రాజకీయ నిరుద్యోగిగా మారారు. అయితే, తాను రాజకీయంలో ఉంటానని, తనకు అనువైన పార్టీని ఎంచుకుంటానని ఆయన చెప్పారు.

పవన్ కల్యాణ్ ఆలా చేయకూడదు....
రాజకీయాల విషయంలో పవన్ కల్యాణ్ తప్పు చేస్తున్నారని, సమావేశాలు పెట్టి తిరిగి వెళ్లిపోతున్నారని, ఆ తర్వాత తనపై వచ్చే విమర్శలకు సమాధానాలు చెప్పే యంత్రాంగం పవన్ కల్యాణ్కు లేదని దాడి వీరభద్రరావు అన్నారు. జట్టు లేకుండా మాట్లాడకూడదని, అలాంటి జట్టు పవన్ కల్యాణ్కు లేదని ఆయన అన్నారు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేవరకు పవన్ మౌనంగా ఉండడం మంచిదని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ కమిట్మెంట్ ఉన్న నాయకుడు, యువకుడు అని ఆయన అన్నారు. మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పారు. తాను పార్థి స్థాయి రాజకీయాల్లోకి వచ్చే తేదీ నిర్ణయించుకునే వరకు పవన్ కల్యాణ్ మాట్లాడకుండా ఉండడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు.

లక్ష్మీపార్వతి అందుకుంటుందేమోనని అలా...
ఎన్టీ రామారావుకు కచ్చితంగా భారతరత్న రావాలని, భారతదేశంలో ఎన్టీఆర్ను మించిన నటుడు లేడని దాడి వీరభద్రరావు అన్నారు. ఎన్టీ రామారావుకు అవార్డు వస్తే లక్ష్మీపార్వతి అందుకుంటుందేమోననే ఉద్దేశంతో చంద్రబాబు గానీ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు గానీ ప్రయత్నాలు చేయడం లేదనే అభిప్రాయం ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు తలుచుకుంటే ఎన్టీఆర్కు ఎందుకు భారతరత్న రాదని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్కు భారతరత్న రాకుండా చంద్రబాబు చేశారనే అపప్రథ మాత్రం ఉంటుందని ఆయన అన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు వచ్చేలా చేయడంలో పురంధేశ్వరి కూడా విఫలమయ్యారని ఆయన అన్నారు.

ఎన్టీఆర్కు అక్కినేనితో విభేదాలు లేవు
ఎన్టీ రామారావుకు, అక్కినేని నాగేశ్వరరావుకు మధ్య వైరం ఉందనేది నిజం కాదని, వారిద్దరు మంచి స్నేహితులని దాడి వీరభద్రరావు చెప్పారు. 1994లో ఎన్టీ రామారావుకు సన్మానం చేసినప్పుడు అక్కినేని నాగేశ్వరరావు రాని మాట నిజమేనని, ఎన్టీఆర్ స్వయంగా పిలువలేదనే కారణంతో అక్కినేని రాలేదని, సన్మానం చేసేవారు పిలువాలి గానీ ఎన్టీఆర్ ఎలా పిలుస్తారని ఆయన అన్నారు. ఆ విషయం ఎన్టీఆర్కు చెప్తే అక్కినేనిని అల్పాహార విందుకు పిలిచారని ఆయన చెప్పారు. అక్కినేని తల్లి ఎన్టీఆర్ను పెద్దబాబు అని పిలిచేదని ఆయన గుర్తు చేశారు.

చంద్రబాబు నుంచి ఆహ్వానం రాలేదు...
తెలుగుదేశం పార్టీలోకి తాను తిరిగి ప్రవేశించడం చంద్రబాబు మీద ఆధారపడి ఉంటుందని దాడి వీరభద్ర రావు చెప్పారు. తాను టిడిపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే చెప్పానని, కానీ చంద్రబాబు నుంచి జవాబు రాలేది ఆయన అన్నారు. ఎవరు అడ్డుపడినా ఆగే మనస్తత్వం చంద్రబాబుది కాదని, వేరే వాళ్లు అడ్డుపడుతున్నందున చంద్రబాబు తనను చేర్చుకోవడం లేదనే మాటలో నిజం లేదని ఆయన అన్నారు.

వంగవీటి హత్యతో చంద్రబాబుకు సంబంధం లేదు...
వంగవీటి హత్యతో నారా చంద్రబాబు నాయుడికి సంబంధం ఉందనే హరిరామజోగయ్య మాటల్లో నిజం లేదని దాడి వీరభద్రరావు అన్నారు. హత్యారాజకీయాలు చేసే సాహసం చంద్రబాబు చేయరని ఆయన స్పష్టం చేశారు. వంగవీటి హత్యకు ఎన్టీఆర్ను బాధ్యుడిని చేయడం సరి కాదని అన్నారు. వంగవీటి రంగా హత్యను కాంగ్రెసు ఓ సామాజికవర్గాన్ని టిడిపికి దూరం చేయడానికి కాంగ్రెసు వాడుకుందని దాడి చెప్పారు.

జగన్ పార్టీలో అసౌకర్యంగా ఫీలయ్యా...
తెలుగుదేశం పార్టీ నుంచి తాను బయటకు రావడం వల్ల తానే నష్టపోయానని, ఓ నాయకుడు వెళ్లిపోవడం వల్ల ఏ పార్టీ కూడా నష్టపోదని, పార్టీ అనేది సముద్రం లాంటిదని దాడి వీరభద్రరావు అన్నారు. వైయస్ జగన నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తాను అసౌకర్యానికి గురైనట్లు తెలిపారు.

పాలన చంద్రబాబు స్థాయిలో లేదు.
అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు స్థాయిలో లేదని దాడి వీరభద్ర రావు అభిప్రాయపడ్డారు. పాలన బాగుందని చంద్రబాబు అనుకుంటున్నారేమో తెలియదని ఆయన అన్నారు. చంద్రబాబుది అధికారులపై ఎక్కువగా ఆధారపడే మనస్తత్వమని, పాలనపై చంద్రబాబుకు గ్రిప్ తగ్గిందేమోనని అనిపిస్తోందని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో పోరాటం చంద్రబాబు టెంపర్మెంట్కు అనుగుణంగా లేదని ఆయనయ అన్నారు చంద్రబాబు బలంగా ఉండి, జాతీయ స్థాయిలో పోరాటం చేసి ఉంటే కేంద్రం దిగి వచ్చేదని ఆయన అన్నారు.

అది జగన్ వల్ల కాదేమో...
రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని దాడి వీరభద్రరావు అభిప్రాయపడ్డారు. అది జగన్కు ఉపయోగపడుతుందా అంటే చెప్పలేమని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత జగన్కు ఉపయోగపడుతుందో లేదో చెప్పలేమని ఆయన అన్నారు. చంద్రబాబుకు ప్రత్యామ్నాయం జగన్ అనే నమ్మకాన్ని వైయస్సార్ కాంగ్రెసు కల్పించలేకపోతోందని దాడి అన్నారు.
-
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఉస్తాద్కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications