బాలయ్యకు దగ్గుబాటి హెచ్చరిక: 'ఎన్టీఆర్' సినిమా విరమించుకుంటే మంచిది
'ఎన్టీఆర్ జీవితంలో కీలక పరిణామాలుగా చెప్పుకునే చివరి రోజులను సరిగా చూపించని పక్షంలో.. కన్నతండ్రికి ద్రోహం చేసిన వ్యక్తి బాలయ్య అభిమానుల ముందు తలదించుకోవాల్సి వస్తుంది'
విజయవాడ: అటు సినిమాలతో ఇటు రాజకీయాలతో తెలుగు జాతి ప్రాశస్త్యాన్ని మరో మెట్టెక్కించిన వ్యక్తి దివంగత ఎన్టీ రామారావు. ఈ రెండు రంగాల్లోను ఆయన వేసిన ముద్ర తెలుగునాట ఎన్నటికీ చెదిరిపోనిది. అలాంటి వ్యక్తి జీవిత చరిత్రను సెల్యూలాయిడ్ మీద ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతుండటం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ స్వయంగా ఈ జీవిత చరిత్రలో నటిస్తుండటం సినిమాకు మరో అదనపు ఆకర్షణ. ఇక్కడిదాకా అంతా బాగానే ఉన్నా.. ఎన్టీఆర్ చివరి రోజుల్లో చోటు చేసుకున్న పలు కీలక పరిణామాలను సినిమాలో చూపిస్తారా? లేదా? అన్నదే ప్రస్తుతం ప్రతీ ఒక్కరిలోను మెదులుతోన్న ప్రశ్న.
తాజాగా ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాపై మాజీ మంత్రి, ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పందించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను చిత్రంగా తీస్తానని బాలకృష్ణ ప్రకటించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో బాలయ్య ఈ ఆలోచనను విరమించుకుంటేనే మంచిదని కూడా ఆయన సలహా ఇవ్వడం గమనార్హం.
ఎన్టీఆర్ జీవితంలో కీలక పరిణామాలుగా చెప్పుకునే చివరి రోజులను సరిగా చూపించని పక్షంలో.. కన్నతండ్రికి ద్రోహం చేసిన వ్యక్తిగా బాలయ్య అభిమానుల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వెంకటేశ్వరరావు సున్నితంగా హెచ్చరించారు.
ఒకవేళ జరిగింది జరిగినట్టు చూపిస్తే.. చంద్రబాబు నాయుడుతో ఇబ్బందులు తప్పవని అన్నారు. ఎన్టీఆర్-చంద్రబాబులలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా జరిగింది జరిగినట్టు చూపించడం కష్టమని అన్నారు. ఇదేదో బాలయ్యకు తాను సలహా ఇస్తున్నట్టు కాదని, ఈ ప్రయత్నం సాధ్యం పడదని తాను చెబుతున్నానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు.