అజ్ఞాతవాసిపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం, అర్ధరాత్రి నుంచి మొదలు
హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఏపీ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.
జనవరి 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రోజూ రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం పది గంటల వరకు ప్రత్యేక షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ఈ నిర్ణయంతో పవర్ స్టార్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఏడు షోలకు అనుమతి కోరిన నిర్మాతలు
అజ్ఞాతవాసి సినిమాతో పవన్ కళ్యాణ్ అభిమానులకు మూడు రోజుల మందే సంక్రాంతి పండుగను తీసుకురాబోతోంది. ఈ సినిమా రోజూ ఏడు ఆటల ప్రదర్శనకు నిర్మాతలు ఏపీ ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. ప్రతి రోజూ ఉదయం పది నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు నాలుగు ఆటలు ప్రదర్శించే అనుమతి థియేటర్లకు ఉంది.

మరో మూడు అదనపు షోలకు ఓకే
అజ్ఞాతవాసి సినిమాకు ప్రేక్షకుల్లో ఉన్న ఆత్రుతను దృష్టిలో ఉంచుకొని రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం పదింటి వరకు మరో మూడు అదనపు షోలకు అనుమతివ్వాలని అజ్ఞాతవాసి నిర్మాతలు చేసిన విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది.

ఫైలుపై చంద్రబాబు సంతకం
ఇందుకు సంబంధించిన ఫైలు పైన సీఎం చంద్రబాబు సంతకం చేయడంతో ప్రతిరోజూ మూడు అదనపు ఆటల ప్రదర్శనకు రాష్ట్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. సాధారణంగా ఆడించే నాలుగు ఆటలతో ఈ మూడు ఆటలు కలిపితే మొత్తం ఏడు ఆటల చొప్పున ఎనిమిది రోజులపాటు ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆదేశాలు
విడుదలైన అన్ని థియేటర్లలోనూ ఇరవై నాలుగు గంటలూ సినిమా ప్రదర్శించేందుకు మార్గం సుగమమైంది. ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే థియేటర్ల వద్ద అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసుశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

పవన్ కళ్యాణ్పై మళ్ళీ మళ్ళీ
పవన్ కళ్యాణ్ పేరును ఉపయోగించుకుంటూ హైప్ సాధించుకుంటున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేష్ కత్తి దీనిపై కూడా స్పందిస్తున్నారు. 'అజ్ఞాతవాసి సినిమా ప్రీమియర్లు విచ్చలవిడిగా వేసుకోవచ్చు. టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. ఎక్స్ట్రా షోలు కూడా పర్మిటెడ్. ప్రజల డబ్బులు ఘరానాగా దోచుకునే ప్లాన్ రెడీ. పవన్ కళ్యాణ్ సలాం ఒకరికి, గులాంగిరి మరొకరి చేసి సాధించుకున్న హక్కులు ఇవి. కానీ పాపం, త్రివిక్రమ్ సినిమాని కాపీకొట్టి ఇబ్బందులపాలు చేశాడని వినికిడి. టి.సిరీస్ వేసిన కేసుతో ట్రైలర్ రిలీజ్ చెయ్యలేక. సినిమాకు కోర్టులో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తేలిక సతమతం అవుతున్న నిర్మాత. చాలా బాధాకరమైన వార్త. కానీ ఏం చేద్దాం! అప్పుడప్పుడు బాధ కూడా మంచిదే!!' అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications