కిరణ్పై దామోదర ఫైర్, అడ్డుపడొద్దని పొన్నం
న్యూఢిల్లీ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మరోసారి మండిపడ్డారు. జలయజ్ఞం ప్రాజెక్టులకు రూ.20వేల కోట్ల అదనపు నిధులు ఏకపక్షంగా కేటాయించారని విమర్శించారు. మంత్రివర్గం ఆమోదం లేకుండా నిధులు విడుదల చేయడం సరికాదని, ఈ విషయంపై సిఎస్కు లేఖ రాయనున్నట్లు చెప్పారు. సిఎస్ స్పందించకుంటే గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. దమ్ముగూడెం ప్రాజెక్టు వల్ల ఖమ్మం జిల్లాల్లో గ్రామాలు ముంపునకు గురవుతాయన్నారు.
టిడిపికి స్పష్టత లేదు: కూనంనేని
టిడిపికి ఏం కావాలో, ఏం చేయాలో ఇప్పటికీ స్పష్టత లేదని సిపిఐ శాసన సభ్యులు కూనంనేని సాంబశివ రావు వేరుగా అన్నారు. అన్ని అంశాలపై సమగ్ర సమాచారం కావాలని టిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్ను అడగడం కంటే బిల్లుపై చర్చిస్తే సమాచారం వస్తుందన్నారు. కుంటిసాకులు చెప్పి సభను అడ్డుకోవద్దన్నారు. ముసాయిదా బిల్లు చర్చకు రాకుండా సీమాంధ్ర ప్రజలను ఆ ప్రాంత ప్రతినిధులు మోసం చేస్తున్నారని, ఇలాంటి వారిని వచ్చే ఎన్నికల్లో తిరస్కరించాలని ప్రజలకు సూచించారు.
అడ్డుపడొద్దు: పొన్నం
మద్రాసు నుండి సీమాంధ్రుల విడిపోయినప్పుడు నైతికత అనిపించినప్పుడు మేం విడిపోవడం నైతికత కాదా అని ఢిల్లీలో కాంగ్రెసు ఎంపి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బిల్లు పైన చర్చకు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు ఇంకా పట్టింపులకో పోవద్దన్నారు. బిల్లు పైన అసెంబ్లీలో వెంటనే చర్చ జరపాలన్నారు. సీమాంధ్ర నేతల తీరు ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేలా ఉందన్నారు. నాలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాంగ్రెసు ఓడినప్పుడు కొందరు పండుగ చేసుకున్నారని, లోక్పాల్ బిల్లు వచ్చిందని, అందరి అవినీతిని బయటపెడతామన్నారు.
బిల్లును అడ్డుకునే కుట్ర సాగనివ్వం: యాష్కీ
తెలంగాణ ముసాయిదా బిల్లును అడ్డుకునే కుట్రలను తాము సాగనివ్వమని మరో ఎంపి మధుయాష్కీ అన్నారు. తెలంగాణ ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని కోరారు.