సీమాంధ్రకు న్యాయం: కిరణ్ తీరుపై దామోదర అసంతృప్తి
విజయవాడ: అసెంబ్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవర్తన సరిగా లేదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అసంతృప్తి వ్యక్తం చేశారు. పదిహేను రోజుల్లో తెలంగాణ వస్తుందని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి కూడా న్యాయం జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన దామోదర కృష్ణా జిల్లాలో విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ఏర్పడి తీరుతుందని, దానికి ముహూర్తం కూడా దగ్గర్లోనే ఉందని స్పష్టం చేశారు. సిఎం ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారని, అటువంటప్పుడు పదవికి రాజీనామా చేసి మాట్లాడి ఉంటే బాగుండేదని అన్నారు. పార్లమెంట్లో రాష్ట్ర విభజన బిల్లు సునాయాసంగా ఆమోదం పొందుతుందని పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన వల్ల రాయలసీమ, తెలంగాణ మధ్య నీటి యుద్ధాలురావని భారీ నీటిపారు దల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంతో పోల్చుకుంటే రాయలసీమ ఎగువ ప్రాంతంలో ఉందని.. తుంగభధ్ర నీరు రాయలసీమ నుంచి దిగువన ఉన్న తెలంగాణకు వస్తుందని చెప్పారు.
దీనివల్ల నీటి యుద్ధాలు ఎలా ఏర్పడుతాయని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్లో తెలంగాణ, సీమాంధ్ర మధ్య జల సమస్య ఏర్పడితే కేంద్ర, జలవనరుల సంఘం పరిష్కరిస్తుందని తెలిపారు. ఫిబ్రవరి 17, 18వ తేదీల్లోగా తెలంగాణ ఏర్పాటు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధమని, ఈ విషయంలో కోర్టులు సైతం పార్లమెంట్ నిర్ణయాన్ని తప్పుపట్టవని కేంద్ర మంత్రి బలరాం నాయక్ అన్నారు. వరంగల్ జిల్లా కురవి శివారు తుల్స్యా తండాలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందన్నారు. ఫిబ్రవరి 15లోపు తెలంగాణ ఏర్పడటం ఖాయమని ఆయన పేర్కొన్నారు. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమని, సీమాంధ్రులు ఎన్నికుట్రలు చేసినా భౌగోళికంగా విడదీయలేరన్నారు.












Click it and Unblock the Notifications