"జగన్కు సీఎం పదవి డేంజర్ అని చెప్పడం వల్లే!.. అప్పట్లో అలా!"
హైదరాబాద్ : దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర విభజన అంశంతో పాటు.. కాంగ్రెస్ నుంచి బయటకెళ్లి జగన్ సొంత పార్టీ పెట్టడం ఇందులో కీలక పరిణామాలు. అయితే అప్పట్లో జగన్ పార్టీ నుంచి బయటకెళ్లడానికి సొంత పార్టీ నేతల వ్యవహార శైలే కారణమంటూ తాజాగా సాక్షి చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
వైఎస్ చనిపోయిన తర్వాత పార్టీలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర పరిణామాల గురించి దానం ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. 'జగన్ చాలా మొండివాడు.. ఎవరినీ లెక్క చేయని వ్యక్తి.. ఇప్పుడే అతన్ని సీఎం చేయొద్దు' అంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలు ఢిల్లీ హైకమాండ్ వద్ద జగన్ పై విషం చిమ్మారని తెలిపారు దానం. జగన్ను సీఎం చేయడమేంటి..? అతను చాలా చిన్న పిల్లగాడు కదా! అంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అడ్డుపుల్లలు వేశారని చెప్పారు.

అసలే కాంగ్రెస్వి పెద్ద చెవులు ఎవరేం చెప్పినా చెవుల్లోకి చేరిపోతుందని ఎద్దేవా చేసిన దానం.. పార్టీలో చాలామంది జగన్ను సీఎం చేయొద్దని పట్టుబట్టడంతో.. ఆయనకు సీఎం పదవి ఇవ్వడం అంత డేంజరా! అన్న ఆలోచనకు కాంగ్రెస్ వచ్చిందన్నారు. అందుకే జగన్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ వ్యతిరేక నిర్ణయాలతోనే జగన్ తన ఉనికిని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా వివరించారు. ఆఖరికి జగన్ చేసిన ఓదార్పు యాత్ర పట్ల కూడా హైకమాండ్ వద్ద లేని పోని ఆరోపణలు చేశారని దానం చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications