వావ్.. ఆకాశంలో నడిచిన ఫీలింగ్.. స్కై వాక్ బ్రిడ్జి.. ఎక్కడ ఉందో తెలుసా..?
సాధారణంగా భూమి మీద నడవచ్చు. కానీ ఆకాశంలో కూడా నడిచే అవకాశం ఉంది. అదెలా అని ఆలోచిస్తున్నారా..? ఇది నిజమే.. వైజాగ్ లో పర్యాటక రంగాన్ని మరింత పెంపొందించేందుకు గ్లాస్ తో స్కై వాక్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఇది భారత్ లోనే అతి పొడవైన గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జి కావడం విశేషం. విశాఖపట్నంలోని కైలాశగిరి హిల్స్ లో సముద్ర తీరాన ఈ గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జిని నెలకొల్పారు. దాదాపు రూ. 7 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. సెప్టెంబర్ 25 న ఈ బ్రిడ్జి ప్రారంభం కాగా.. అప్పటి నుంచి టూరిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
విశాఖపట్నంలోని కైలసగిరి పర్వతాల్లో టైటానిక్ వ్యూ పాయింట్ వద్ద నెలకొల్పిన ఈ వేలాడే గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జి నుంచి విశాఖపట్నం అందాలు, సముద్రాన్ని చూసేందుకు పర్యటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక వీకెండ్స్ అయితే హైదరాబాద్ నుంచి కూడా టూరిస్టులు ఇక్కడికి వచ్చి వైజాగ్ అందాలను తనివితీరా ఆస్వాదిస్తున్నారు. ఇది భారత్ లోనే అతి పొడవైన గ్లాస్ తో చేసిన స్కై వాకింగ్ బ్రిడ్జి.
ఈ బ్రిడ్జి పొడవు 50 మీటర్లు ఉంటుంది. పూర్తిగా క్యాంటి లీవర్ గ్లాస్ తో నిర్మించారు. ఈ బ్రిడ్జి మీద ఒకేసారి దాదాపు 40 మంది టూరిస్టులు చేరుకుని ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఇక టికెట్ ధర ఒక్కొక్కరికి రూ. 250 నుంచి రూ. 300 వరకు ఉంటుంది. వీకెండ్స్ లో ఫ్యామిలీతో వచ్చి ఇక్కడి వ్యూ పాయింట్ నుంచి విశాఖ సముద్రం అందాలు, కైలాసగిరి హిల్స్ లోని పచ్చని, దట్టమైన అడవి అందాలను ఆస్వాదించవచ్చు.

రూ. 7 కోట్లతో దాదాపు 40 టన్నుల స్టీల్ ను ఉపయోగించి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ బ్రిడ్జి ఒకేసారి దాదాపు 100 మందికి పైగా పర్యాటకుల బరువును మోయగలదు. ఒక్కో ట్రిప్ కు 40 మందిని అక్కడి సిబ్బంది పంపిస్తోంది. ముఖ్యంగా సూర్యాస్తమయం, సూర్యోదయం అందాలను చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. బ్రిడ్జి మీద నుంచి కిందకు చూస్తే గాల్లో నడుస్తున్న ఫీలింగ్ వస్తుందంటూ పర్యటకులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్ నుంచి ఈ ప్రదేశానికి 630 కిలోమీటర్లు ఉంది. 11 నుంచి 12 గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు.












Click it and Unblock the Notifications