చిరంజీవి ఎందుకు అలా చేశారో అర్థం కాలేదు!: దాసరి
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రచార కమిటీ సారథి చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో ఎందుకు విలీనం చేశారో అర్థం కాలేదని కేంద్ర మాజీ మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణ రావు అన్నారు. దాసరి నారాయణ రావు ప్రముఖ తెలుగు టీవి ఛానల్తో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. పిఆర్పీ విలీనానికి తాను బయటకు రావడానికి సంబంధం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తీరు తనను చాలా బాధించిందని చెప్పారు. బొగ్గు కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బొగ్గు కుంభకోణం విషయంలో తన పైన పడ్డ మచ్చ చెరిగిపోయే వరకు తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని దాసరి చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి తనను గతంలో కలిసింది కేవలం తన ఆశీస్సులు తీసుకోవడానికేనని చెప్పారు. తన పార్టీలో చేరమని పిలిచేందుకు ఆయన కలువలేదన్నారు. ఆయన పైన తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు.
ముఖ్యమంత్రిగా ఉంటూ సొంత పార్టీ అధిష్టానానికి ఎదురు తిరగడంపై ఆయనకు కితాబిచ్చారు. పార్టీలో ఉంటూ, అదీ ముఖ్యమంత్రిగా ఉంటూ ఎదురు తిరగడం... ఎవరు ఇప్పటి వరకు చేయలేదని చెప్పారు. కిరణ్ రెడ్డిని తాను సమర్థించాలనుకున్నానని, అయితే సమయం చాలలేదన్నారు. ఆయన నమ్ముకున్న వారు ఒక్కరొక్కరు పార్టీని వీడి వెళ్లిపోయి ఆయనను ఒంటరి చేశారన్నారు.