ప్రధాని స్పందిస్తున్నా..ఏపీ డిప్యూటీ సీఎం మాత్రం మౌనం: కరోనాపై సలహాదారులే కీలక పాత్ర: అమాత్యా ఎక్కడ
అమరావతి: కరోనా వైరస్ తో అనూహ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తొలుత ఏపీకి భయం లేదని భావించినా..ఇప్పటికే రెండు కేసులు పాజిటివ్ గా నమోదయ్యాయి. విదేశాల నుండి వచ్చి వందలాది మందిని ఐసోలేషన్ లో ఉంచారు. అయితే, దేశ వ్యాప్తంగా కరోనా పరిస్థితి పైన స్వయంగా ప్రధాని సమీక్షిస్తున్నారు. ఈ రాత్రి ఆయన జాతిని ఉద్దేశించి ఇదే అంశం పైన ప్రసంగానికి సిద్దమయ్యారు. పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ ప్రతీ రోజు మీడియా సమావేశం ద్వారా ప్రజలకు తమ రాష్ట్రంలో కేసుల వివరాలు..ప్రభుత్వం నుండి చర్యలు..ప్రజలకు సూచనలు చేస్తున్నారు. కానీ, ఏపీలో మాత్రం అంతా అధికారులతోనే కరోనా పైన నియంత్రణ చర్యలు సాగుతున్నాయి.
మౌనం పాటిస్తున్న ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని
ఏపీలో కరోనా వైరస్ పరిస్థితి తీవ్ర రూపం దాల్చలేదు. ఇప్పటి వరకు రెండు కేసులు మాత్రమే రికార్డ్ అయ్యాయి. ముఖ్యమంత్రి వద్ద సమీక్షలకు హాజరవుతున్నా..తన ఆధ్వర్యంలో సమీక్షించినా..ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఆరోగ్య శాఖ పర్యవేక్షిస్తున్న ఆళ్ల నాని మాత్రం ఇంత వరకు ఏ రకంగా ముందుకు వెళ్లటం లేదు. ఇటు వంటి ఇబ్బంది కర పరిస్థితుల్లో నిత్యం ప్రజలకు సందేశాలు ఇస్తూ..అవగాహన పెంచుతూ..ఆందోళన తగ్గించాల్సిన మంత్రి మౌనం పాటిస్తున్నారు. అంతా..ముఖ్యమంత్రి కార్యాలయం..ఆరోగ్య శాఖ ముఖ్య కార్య దర్శి మాత్రమే ఏపీలో కరోనా పరిస్థితి పైన మీడియా సమావేశాలు..బులెటిన్ విడుదల ద్వారా సమాచారం ఇస్తున్నారు.
ప్రజలతో ప్రధాని..పొరుగు రాష్ట్రాల్లో అలా..
కరోనా పైన జాతీయ స్థాయిలోనూ..తెలుగు రాష్ట్రాల్లోనూ ఆందోళన పెరుగుతోంది. దీంతో..ఈ రోజు ప్రధాని జాతికి సందేశం ఇవ్వాలని నిర్ణయించారు. ఇక, తెలంగాణలో ఇప్పటి వరకు 13 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అక్కడ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రతీ రోజు సమీక్షలతో పాటుగా నేరుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐసోలేషన్ వార్డును..విదేశీయులు వస్తున్న వేళ శంషాబాద్ ఏయిర్ పోర్టు లో తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ప్రతీ రోజు సాయంత్రం మీడియా ద్వారా ప్రజలకు తమ రాష్ట్రంలో కరోనా పరిస్థితి..ప్రజలకు తీసుకోవాల్సిన సూచనలు..ప్రభుత్వ పరంగా తీసుకుంటు న్న చర్యలు..అప్రమత్తత గురించి వివరిస్తున్నారు. కానీ, ఏపీలో కరోనా పైన ముఖ్యమంత్రి వద్ద సమీక్షలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ మూడు రోజు లుగా మీడియా ముందుకు వచ్చి కరోనా నివారణ పైన సూచనలు చేస్తున్నారు. ఇక, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి కరోనా పై సమీక్షలు చేస్తూ బులెటిన్ లు విడుదల చేస్తున్నారు.
ఏపీ ఆరోగ్య మంత్రి మాత్రం ఇలా..
ఏపీలో ఇప్పటి వరకు నెల్లూరు..ఒంగోలు లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుండి వచ్చిన వారిని 883 మంది ప్రయాణికుల్ని గుర్తించగా..607 మంది ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారు. 254 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యింది. 22 మంది ఆసుపత్రిలో వైద్యుల పరిశీలనలో ఉన్నారు..109 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 94 మందికి నెగటివ్ వచ్చింది. 13 మంది శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. అయితే, పరిస్థితిని అధికారులు వివరిస్తున్నా.. ఉప ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటి వరకు ప్రజలకు నేరుగా కరోనా పైన వాస్తవ పరిస్థితి..ప్రభుత్వ పరంగా అభయం ఇవ్వ లేదు. ఆయన ఎందుకు ఈ విషయంలో మౌనం పాటిస్తున్నారనేది అధికార వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. సున్నిత సందర్బాల్లో ఈ మౌనం ప్రభుత్వానికి ఇబ్బంది కరంగా మారుతోంది. ఫిలిప్పీన్స్ నుండి విశాఖకు వందల సంఖ్యలో విద్యార్ధులు వచ్చారు. ఈ మొత్తం లెక్కలు అధికారులు చెబుుతున్నా.. సంబంధిత మంత్రి ఆళ్ల నాని ఎందుకు ఇటువంటి సమయంలో యాక్టివ్ గా ఉండటం లేదనేది ఇప్పుడు ప్రభుత్వంలో కరోనా తో పాటుగా సాగుతున్న చర్చ.