బొత్స రాక: సోనియాపై కిరణ్ పైచేయి! బాబుVsజగన్
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై దేశ రాజధాని న్యూఢిల్లీ వేడెక్కింది. ఇరు ప్రాంతాలకు చెందిన, అన్ని ముఖ్యమైన రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు అందరూ ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై పోటా పోటీగా లాబీయింగ్ చేయడంతో పాటు ఆందోళనలు, దీక్షలు చేస్తున్నారు. సమైక్య రాష్ట్రం కోసమంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు జంతర్ మంతర్ వద్ద నాలుగు గంటల పాటు దీక్ష చేశారు.
ఈ దీక్షలో పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రులు కావూరి సాంబశివ రావు, చిరంజీవి తదితరులు పాల్గొనటం గమనార్హం. సమైక్యాంధ్ర కోసం దీక్ష చేసినట్లు కిరణ్, ఆయన వర్గం చెప్పగా, నిన్న బొత్స మాట్లాడుతూ... విభజన ద్వారా సీమాంధ్రకు న్యాయం, విభజన రాజ్యాంగ బద్దంగా లేదని దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. బొత్స, కావూరి వంటి నేతలు తాము సమైక్యవాదులం అని చెబుతూనే.. అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటామని చెప్పారు.
కానీ ఇప్పుడు సమైక్యం కోసమంటూ చేసిన కిరణ్ దీక్షలో వారు పాల్గొన్నారు. కిరణ్ ఒక్కడికే క్రెడిట్ రాకుండా ఉండేందుకే.. అధిష్టానం నిర్ణయానికి అనుకూలంగా నడుచుకుంటామని చెప్పిన వారు దీక్షలో పాల్గొన్నారా? లేక కిరణ్ తీరు తప్పనిసరి పరిస్థితుల్లో వారిని రప్పించేలా చేసిందా? తమ తమ రాజకీయ భవిష్యత్తు కోసం వారు రాక తప్పలేదా? అనే చర్చ సాగుతోంది. కిరణ్ అధిష్టానానికి సవాల్గా మారడాన్ని ఢిల్లీ పెద్దలతో పాటు బొత్స వంటి రాష్ట్ర నేతలు కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా ఖండించారు.
ఇప్పుడు ఆయన చేపట్టిన దీక్షలో వారు పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. అయితే, వారు అధిష్టానం అనుమతితోనే దీక్షలో పాల్గొని ఉంటారని అంటున్నారు. వారిని రప్పించడం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైచేయి సాధించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కిరణ్ దీక్ష, సమైక్యం అంతా అధిష్టానం కనుసన్నుల్లోనే జరుగుతుందనే వారు లేకపోలేదు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు మొదటి నుండి అవే ఆరోపణలు చేస్తున్నాయి.
కాంగ్రెసు పార్టీలో ఉంటూ, అదీ ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చొని మొదటి నుండి అధిష్టానాన్ని ధిక్కరిస్తూ సమైక్యవాదం వినిపిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి తన దీక్ష ద్వారా సీమాంధ్రలో మరింత ఇమేజ్ పెంచుకున్నారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిల కంటే ఎక్కువ క్రెడిట్ కొట్టేశారని సీమాంధ్ర కాంగ్రెసులోని కిరణ్ వర్గం భావిస్తోంది.
మరోవైపు చంద్రబాబు వరుసగా జాతీయ పార్టీ నాయకులను కలుస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీలో తెలంగాణకు వ్యతిరేకంగానే లాబీయింగ్ చేస్తున్నారనే తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజులాగా సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ ఇమేజ్ క్రమంగా పెరుగుతున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీలో లాబీయింగ్ ద్వారా.. అదీ సమైక్యాంధ్రకు అనుకూలంగా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇది సీమాంధ్రలో టిడిపికి బాగా కలిసి వస్తుందని అంటున్నారు. సీమాంధ్ర టిడిపి ఎంపీలు కూడా పార్లమెంటులో, బయట ఆందోళన చేస్తున్నారు. బాబు లాబీయింగు తెలంగాణ టిడిపి నేతలకు జీర్ణించుకోలేని విధంగా తయారయిందని అంటున్నారు. చంద్రబాబు బిజెపిని కలిశారో ఆ పార్టీ వైఖరిలో మార్పు వచ్చిందని పలువురు చెబుతున్నారు.
ఇంకవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో బుధవారం ఢిల్లీకి వచ్చి సమైక్యాంధ్ర కోసం రాష్ట్రపతిని కలిసింది. వారు మొదట జంతర్ మంతర్ వద్ద దీక్ష చేద్దామనుకున్నప్పటికీ కిరణ్ అప్పటికే దీక్ష చేస్తుండటంతో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో తెలంగాణ అంశంపై పోరు ద్వారా ముఖ్యమంత్రి వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోగా, చంద్రబాబు సీమాంధ్రలో బలం పెంచుకునేందుకు ఉపయోగపడుతోందని, అదే సమయంలో తెలంగాణలో ఆయనకు నష్టం కలిగించనుందని చెబుతున్నారు.