ఢిల్లీలో జగన్ మార్క్ రాజకీయం - "పొత్తు" లపై క్లారిటీ: ఫుల్ సపోర్ట్..!?
ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధాని మోదీ - కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సీఎం సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన పాలనా - రాజకీయ అంశాలపైన చర్చించారు. ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న సీఎం జగన్ ఈ ఇద్దరు ముఖ్య నేతలతో ఏపీకి కేంద్రం నుంచి అందాల్సిన ప్రయోజనాల పైన ప్రధానంగా చర్చించారు. ఏపీలో తిరిగి 2014 పొత్తులు రిపీట్ చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు అడుగులు వేస్తున్న వేళ..సీఎం జగన్ ఢిల్లీ కేంద్రంగా తన మార్క్ రాజకీయం చూపించారు. ఢిల్లీ పర్యటన వేళ సీఎం జగన్ హ్యాపీగా ఉన్నారు. ఏపీలో పొత్తుల దిశగా ప్రతిపక్ష పార్టీల ప్రయత్నాల నడుమ ప్రధాని మోదీ - అమిత్ షా పూర్తి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ప్రస్తావించిన అంశాల్లో పూర్తిగా మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం వేళ
ప్రధాని మోదీ సీఎం జగన్ దాదాపు 45 నిమిషాలు భేటీ అయ్యారు. ఏపీకి కేంద్రం నుంచి కావాల్సిన సాయం పైన చర్చించారు. అదే సమయంలో రాజకీయ చర్చలు జరిగాయని విశ్వసనీయ సమాచారం. వచ్చే మార్చి నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి నేరుగా ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. అదే విధంగా మచిలీపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ పైన వేస్తున్న అడుగులను ప్రధానికి సీఎం వివరించారు. రాజకీయంగానూ చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సారి ఏపీతో పాటుగా తెలంగాణ రాజకీయాలపైన ఇద్దరి మధ్య చర్చ జరిగిందని చెబుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో తాజాగా చంద్రబాబు ఎంట్రీ పైనా ప్రస్తావనకు వచ్చిందని అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రికి అన్ని రకాలుగా అండగా నిలుస్తామని ప్రధాని హామీ ఇచ్చారని..పరోక్షంగా పొత్తుల అంశంలోనూ తన విధానం స్పష్టం చేసారని విశ్వసనీయ సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో కొత్త పొత్తులపైనా..!
ఇప్పుడు ఏపీ కంటే తెలంగాణ రాజకీయాలు బీజేపీకి కీలకం. తెలంగాణలో మరో పది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా టీఆర్ఎస్ ను ఓడించాలనేది బీజేపీ లక్ష్యం. ఇందుకోసం కలిసి వచ్చే అంశాల పైన ఫోకస్ పెట్టారు. బీజేపీ అవసరాన్ని తనకు అనుకూలంగా మలచుకొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా తొలి అడుగు వేసారు. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వటం..టీఆర్ఎస్ నేతల స్పందనతో కావాల్సిన ప్రచారం వచ్చేసింది. తెలంగాణ నుంచి ఏపీ దిశగా పొత్తు విస్తరించాలనేది అసలు లక్ష్యం. కానీ, తెలంగాణ బీజేపీ నేతలు టీడీపీ - జనసేనతో పొత్తుకు సిద్దంగా లేరని..ఇదే విషయాన్ని పార్టీ ముఖ్య నాయకత్వానికి నివేదించారని సమాచారం. బీజేపీలోని కీలక నేతలు ఇదే విషయాన్ని నిర్దారిస్తున్నారు. కానీ, పొత్తుల అంశంలో ప్రధాని మోదీ- హోం మంత్రి అమిత్ షాది తుది నిర్ణయం కావటంతో ఆ ఇద్దరి నేతల అభిప్రాయం కీలకంగా మారుతోంది.

సీఎం జగన్ మార్క్ రాజకీయం - ఫుల్ హ్యాపీ
ఈ సారి ఢిల్లీ పర్యటన లో ప్రధాని మోదీ- హోం మంత్రి అమిత్ షా తో సమావేశంలో సీఎం జగన్ కోరుకున్న క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. సీఎం జగన్ ప్రధానితో సమావేశం తరువాత అన్ని అంశాలు చర్చించామని..సానుకూలంగా స్పందించారని..ట్వీట్ చేసారు. అమిత్ షా తో సీఎం జగన్ దాదాపు 40 నిమిషాలు సమావేశం అయ్యారు. తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ఏపీ విభజన అంశాలు, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పొత్తు రాజకీయాల గురించి చర్చకు వచ్చిన సమయంలో ప్రతిపక్ష పార్టీల బలా బలాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు కీలక నేతలతో సమావేశం సమయంలో ముఖ్యమంత్రికి పూర్తి మద్దతు కనిపించినట్లు సమాచారం. దీంతో, తిరిగి అధికారంలోకి రావాలనే జగన్ లక్ష్యానికి అనుగుణంగానే స్పందన వచ్చిందని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications