అమరవీరుల, స్వాతంత్ర్య సమరయోధుల కోసం ఓ వెబ్సైట్
న్యూఢిల్లీ: అమరవీరులు, స్వాతంత్య్ర సమరయోధుల కోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వెబ్సైట్లో అమరవీరుల త్యాగాన్ని, వారికి సంబంధించిన వివరాలన్నింటిని భావి తరాలకు తెలిసేలా, యువతరానికి స్ఫూర్తినిచ్చేలా పొందుపరుస్తారు.
ఈ నెల 27వ తేదీన షహీద్ భగత్ సింగ్ 110వ జయంతి సందర్భంగా అమరవీరులను, స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించేందుకు 'షహీద్ ఉత్సవ్' పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వెబ్సైట్ను ప్రారంభిస్తామని మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.
ఇందుకోసం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి స్వాతంత్య్ర సమరయోధులను, వీర సైనికులను ఎంపిక చేస్తారు. వారి కుటుంబ సభ్యులను లేదా వారసులు, సన్నిహితులను కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. విదేశాల్లో స్థిరపడ్డవారికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ద్వారా వారి కుటుంబాలను సంప్రదించారు.