ప్రభాస్కు నోటీసులు జారీచేసిన ఢిల్లీ హైకోర్టు
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'ఆదిపురుష్' చిత్ర బృందానికి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ప్రభాస్తో పాటు మొత్తం చిత్రయూనిట్కు నోటీసులు జారీ చేసింది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలైంది. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ ఓ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆదిపురుష్ విడుదల కాకుండా స్టే విధించాలని కోరింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నోటీసులు జారీచేసింది.

ఆదిపురుష్ పై ట్రోలింగ్ దారుణం
కొద్ది రోజులుగా ఆదిపురుష్ టీజర్పై ట్రోలింగ్ దారుణంగా జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఆదిపురుష్ గురించే చర్చ నడుస్తోంది. యానిమేషన్ సినిమాలా ఉందని, గ్రాఫిక్స్ బాగోలేదంటూ ప్రేక్షకులు, అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. రాముడు, రావణుడు, హనుమంతుడి పాత్రలను చూపించిన విధానం సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామాయణం గురించి అధ్యయనం చేయకుండా ఓంరౌత్ ఈ సినిమాను తీశారంటూ కొంతమంది బీజేపీ నేతలు కూడా మండిపడుతున్నారు.

ఫోన్ లో కాకుండా వెండితెరపై చూడాలంటున్న పెద్దలు
ఆదిపురుష్ చిత్రానికి సంబంధించిన పూర్తిస్థాయి ట్రైలర్ ను విజయదశమి సందర్భంగా విడుదల చేయాలనుకున్నప్పటికీ ప్రభాస్ పెదనాన్న, కథానాయకుడు కృష్ణంరాజు మరణించడంతో వాయిదా వేశారు. పూర్తిస్థాయిలో ట్రైలర్ విడుదలైతే అసలు సినిమాలో వీఎఫ్ఎక్స్ ఏ మాత్రం ఉన్నాయో ఒక స్పష్టత వచ్చేది. కొందరు దర్శకులు మాత్రం ఫోన్లలో చూస్తే ఈ సినిమాను ఆస్వాదించలేరని, అందులో ఉన్న గ్రాఫిక్స్, నటీనటుల ప్రావీణ్యాన్ని చూడాలంటే వెండితెరపైనే చూడాలని కోరుతున్నారు.

రాముణ్ని క్రూరంగా చూపించారు
రాముడు, రావణుడి పాత్రల చిత్రీకరణ అభ్యంతరకరంగా ఉందని, రామాయణాన్ని ఏ మాత్రం పరిశోధన చేయకుండా సినిమా తీశారని న్యాయవాది రాజ్ గౌరవ్ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. హిందువుల నమ్మకం ప్రకారం రాముడు ఉదార స్వభావంతో ప్రశాంత చిత్తంతో ఉంటాడు, కానీ టీజర్ లో క్రూరమైన ప్రతీకార రూపంగా చూపించారని, ఆంజనేయులు రబ్బరు దుస్తులు ధరించారని, రావణుడి పాత్ర భయంకరగా ఉందని రాజ్ గౌరవ్ ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications