నోట్ల రద్దు: కేసీఆర్ వ్యూహాత్మక అడుగు, చిక్కుల్లో బాబు.. మళ్లీ తప్పులో కాలేశారా?
రూ.500, రూ.1000 నోట్ల రద్దు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే, చంద్రబాబు తొందరపడి చిక్కుల్లో పడ్డారనే వాదనలు వినిపిస్తున్నాయి.
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించపోయి చిక్కుల్లో పడ్డారా? అంటే అవుననే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. నోట్ల రద్దును తాను మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నానని, దానిని స్వాగతిస్తున్నానని మోడీ నోట్ల రద్దు ప్రకటన తర్వాత చంద్రబాబు చెప్పారు.
అయితే, నోట్ల రద్దు అనంతరం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జనాలు ప్రభుత్వం పైన అసహనం వ్యక్తం చేస్తున్నారని, ఇదే విషయాన్ని టిడిపి నేతలు చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్లిన తర్వాత ఆయన రివర్స్ గేర్ వేశారని అంటున్నారు.
ఇటీవల ఆయన నోట్ల రద్దు ప్రకటించి ఇన్ని రోజులు ఇయినా సమస్య పరిష్కారం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పది రోజుల్లో రెండు సమావేశాలు చంద్రబాబు రివర్స్ గేర్ వేసేలా చేశాయని అంటున్నారు.
పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న వెంటనే చంద్రబాబు స్పందించారు. తాను పెద్దనోట్లు రద్దు చెయ్యాలని కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. తన లేఖ వల్ల కూడా ఈ నోట్లు రద్దయ్యాయని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు.
దీంతో నోట్ల రద్దుతో ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ఇబ్బందులు పడుతున్న వారు మోడీతో పాటు చంద్రబాబును కూడా విమర్శించడం మొదలు పెట్టారట. విషయాన్ని టిడిపి నేతలు చంద్రబాబు చెవిన వేశారని అంటున్నారు.
ఆ తర్వాత టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేసంలోను ఎంపీలు, నేతలు విషయం చెప్పారని అంటున్నారు. ప్రజలు తిడుతున్నారని చంద్రబాబుకు ఓ ఎంపీ చెప్పారట.
వారు అలా చెప్పిన అనంతరం చంద్రబాబు పునరాలోచనలో పడ్డారని, ఐవీఆర్ఎస్ సర్వేలో 82 శాతం మంది పెద్ద నోట్లను రద్దు చేసే సమయంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టక పోవడాన్ని తప్పుబట్టారని తెలిసిందని అంటున్నారు. కేంద్రం విఫలమైందని చాలా మంది చెప్పారని అంటున్నారు. దీంతో చంద్రబాబు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారని అంటున్నారు. ఆ తర్వాతే నోట్ల రద్దు జరిగి ఇన్ని రోజులు అయినా సమస్య కొలిక్కి రాలేదని ఆయన కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేశారని అంటున్నారు.
కాగా, 2004లోను చంద్రబాబుకు ఇలాంటి పరిణామం ఎదురైందని గుర్తు చేసుకుంటున్నారు. హైటెక్ సిటీ అంటూ చెప్పుకున్న చంద్రబాబును రైతులు తిరస్కరించారు. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే పెద్దగా స్పందించడం లేదని, అలాంటప్పుడు చంద్రబాబు మాట్లాడటం ఏమిటని టిడిపి నేతలే చెవులు కొరుక్కుంటున్నారట.
మరోవైపు, పెద్ద నోట్ల రద్దు విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. ఆయన పరిస్థితిని పూర్తిగా ఆకళింపు చేసుకున్న అనంతరం ప్లాన్గా వ్యవహరించారని అంటున్నారు.
కేసీఆర్ నోట్ల రద్దును స్వాగతిస్తూనే, మరోవైపు రద్దు నేపథ్యంలో సామాన్యుల ఇబ్బందుల పైన ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఆయనను పిలిపించుకున్నారు. తద్వారా.. నోట్ల రద్దును స్వాగతిస్తూనే, ప్రజల ఇబ్బందుల పైన కేసీఆర్ కేంద్రాన్ని నిలదీశారనే అభిప్రాయం ఏర్పడింది. చంద్రబాబు మాత్రం కేసీఆర్లా వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారట.