ఏపీ ఉద్యోగులకు శాలరీ కష్టాలు, బ్యాంకులకు రాని డబ్బు: బీజేపీకి ఉమ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లోని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో గల ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంకుకు ఇంకా డబ్బులు రాలేదు. దీంతో ఖాతాదారులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లోని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో గల ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంకుకు ఇంకా డబ్బులు రాలేదు. దీంతో ఖాతాదారులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. గురువారం ఒకటో తేదీ కావడంతో తమ జీతాలు డ్రా చేసుకునేందుకు ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
అయితే బ్యాంకులకు డబ్బులు రాలేదని బ్యాంకు సిబ్బంది ఉద్యోగులతో చెప్పారు. దీంతో వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి బ్యాంకులకు సకారంలో డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.
నోట్ల రద్దు-తెలంగాణ ఆఫర్: ఉద్యోగులకు రూ.10వేల నగదు పంపిణీ
బంగారంపై బోండా ఉమ బీజేపీకి హెచ్చరిక
తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే బోండా ఉమ మిత్రపక్షం భారతీయ జనతా పార్టీని హెచ్చరించారు. కేంద్రం తదుపరి సర్జికల్ స్ట్రయిక్స్ బంగారం పైన అనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోండా ఉమ స్పందించారు.
కేంద్రం పాత బంగారం జోలికి వస్తే బాగుండదని హెచ్చరించారు. అలా చేస్తే అది తుగ్లక్ నిర్ణయం అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ పైన మండిపడ్డారు. మహిళల సెంటిమెంటుతో ఆడుకోవద్దని తాను మిత్రపక్షం బీజేపీకి చెబుతున్నానన్నారు.