పొంచివున్న తీవ్ర వాయుగుండం - చలికి తోడు భారీ వర్షాలు..!!
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా విసురుతోంది. చలి తీవ్రత అనూహ్యంగా పెరుగుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రత క్షీణిస్తోంది. ఇంకా డిసెంబర్ రాకముందే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాలు మంచు దుప్పటికి కప్పుకొంటోన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలపై చలి తీవ్రత అధికంగా ఉంటోంది. రాత్రి ఉష్ణోగ్రత కనిష్ఠ స్థాయికి చేరుకుంటోంది. సింగిల్ డిజిట్కు పడిపోతోంది. పగటి ఉష్ణోగ్రత కూడా అదే స్థాయిలో రికార్డవుతోంది.
తగ్గుతున్న ఉష్ణోగ్రతకు తోడు..
రెండు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఉష్ణోగ్రత పడిపోతూ వస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 17వ తేదీన 12.2 డిగ్రీలు, 19వ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత తగ్గింది. 10.7 డిగ్రీలకు చేరింది. ఈ శీతాకాలంలో ఇప్పటివరకు నమోదైన అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత ఇదే. క్రమంగా సంఖ్య మరింత పడిపోవచ్చని, సింగిల్ డిజిట్కు చేరుకోవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తోన్నారు. రాత్రి ఉష్ణోగ్రత 8 నుంచి 9 డిగ్రీల వరకు నమోదువుతుందని చెబుతున్నారు.
భారీ వర్షాలు..
ఈ పరిణామాల మధ్య మళ్లీ భారీ వర్షాలు ముంచుకు రానున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. చెన్నైకి 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఇది తమిళనాడు ఉత్తర ప్రాంతం వైపు కదులుతోంది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెన్నైలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తమిళనాడు ఉత్తరం- ఏపీ దక్షిణ ప్రాంత జిల్లా్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
వాయుగుండం తీరం వైపు..
బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా ఈ వాయుగుండం ఏర్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. కరైకాల్కు తూర్పు-ఆగ్నేయం దిశగా 500 కిలోమీటర్లు, చెన్తొకి 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మంగళవారం నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, తూర్పు రాయలసీమ తీరానికి చేరుతుందని అన్నారు.
దక్షిణ కోస్తా, సీమ జిల్లాలపై..
దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని సూచించారు. దక్షిణ కోస్తా-తమిళనాడు తీరం వెంబడి వేటకు వెళ్ల కూడదని పేర్కొన్నారు.
చలికి తోడు..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్ల ప్రజలు చలిలోనే తమ రోజువారీ కార్యక్రమాలను నిర్వహించుకుంటోన్నారు. అనంతగిరి, అరకులోయ, కొయ్యూరు, జీకే వీధి, చింతూరు, దేవీపట్నం, మారేడుమిల్లి, లంబసింగి, డుంబ్రిగూడ, ముంచంగిపుట్టు, వీఆర్ పురం.. గ్రామాల్లో చలి పంజా విసురుతోంది. నవంబర్లోనే ఈ పరిస్థితి ఉంటే.. డిసెంబర్ నాటికి చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. మున్ముందు ఉష్ణోగ్రత మరింత తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.