వర్షాలొచ్చేస్తున్నాయ్: ఏపీలోని ఈ జిల్లాల్లో..వచ్చే 24 గంటల్లో!
అమరావతి: గత ఏడాది నవంబర్-డిసెంబర్లో రాష్ట్రంలో కరవుదీరా వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు ముంచెత్తాయి. కరవు ప్రాంతంగా పేరున్న అనంతపురం సహా అన్ని జిల్లాల్లోనూ అధిక వర్షపాతం నమోదైంది. ఏపీ దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు సహా రాయలసీమలోని చిత్తూరు, కడప, అనంతపురంలోని చెరువులు, కుంటలు.. అన్ని పొంగిపొర్లాయి.
పోలవరానికి వైఎస్ జగన్: గజేంద్రసింగ్తో కలిసి సందర్శన: విజయవాడలో కేంద్రమంత్రి
రిజర్వాయర్లు ఫుల్..
పెన్నా, కుందూ, చిత్రావతి నదులు ఉప్పొంగాయి. దీని దెబ్బకు కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్ట్ ఆనకట్ట సైతం తెగిపోయింది. గ్రామాలను ముంచెత్తింది. దాదాపుగా నెలరోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలతో తిరుపతిలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ భారీ వర్షాల వల్ల అప్పటిదాకా- నామరూపాల్లేకుండా పోయిన రాయలచెరువు జలకళను సంతరించుకుంది. వరదనీటితో పోటెత్తింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ అన్ని రిజర్వాయర్లల్లో నీటి మట్ట గరిష్ఠ స్థాయికి చేరుకుంది.
ఇప్పుడు మళ్లీ..
వ్యవసాయం, మంచినీటి అవసరాల కోసం ఇంకో రెండు సంవత్సరాల పాటు ఎలాంటి ఆందోళన అక్కర్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ మూడు నెలల విరామం తరువాత.. మళ్లీ మరోసారి అలాంటి పరిస్థితులే రాష్ట్రంలో ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో కోస్తా తీర ప్రాంతాలు.. ప్రత్యేకించి- ఏపీ దక్షిణం, రాయలసీమతో పాటు తమిళనాడు ఉత్తర ప్రాంతంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
వాయుగుండంగా అల్పపీడనం..
బంగాళాఖాతం దక్షిణప్రాంతం-హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు చెప్పారు. వచ్చే 24 గంటల్లో ఇది క్రమంగా తమిళనాడు ఉత్తర ప్రాంత తీరానికి సమీపిస్తుందని పేర్కొన్నారు. ఇది మరింత బలపడి- పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుందని అంచనా వేశారు. తీవ్ర వాయుగుండంగా మారుతుందని, ఫలితంగా దక్షిణ కోస్తా ప్రాంతంలోని ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు విస్తారంగా వివరించారు.
50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతొ ఈదురుగాలులు
నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో చాలాచోట్ల ఓ మోస్తరు సగటు వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు. 6వ తేదీ వరకు వర్షాల తీవ్రత ఉంటుందని స్పష్టం చేశారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని చెప్పారు. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులెవరూ చేపలవేటకు వెళ్లొద్దని సూచించారు.
తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.