అసెంబ్లీలో సెల్ ఫోన్లు వాడేస్తున్న ఎమ్మెల్యేలు-రఘురామ ఫైర్..!
ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ, వ్యాఖ్యలు చేస్తూ సరదాగా కనిపిస్తున్న రఘురామకృష్ణంరాజు ఇవాళ మాత్రం ఓ విషయంలో ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అదీ ఏకంగా నిబంధనల్ని, గతంలో స్పీకర్లు ఇచ్చిన రూలింగ్స్ ను, సభా గౌరవాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలపై ఆయన ఫైర్ అయ్యారు. అదే సమయంలో వారికి కీలక సూచనలు చేశారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సభకు హాజరవుతున్న ఎమ్మెల్యేలు మొబైల్ ఫోన్లను వాడుతున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గుర్తించారు. అసెంబ్లీ ప్రాంగణం, లాబీల్లో మాత్రమే కాకుండా ఏకంగా సభలోనే ఫోన్లు మాట్లాడుతూ కనిపించడంపై రఘురామరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలు సభలో ఫోన్లు మాట్లాడుతున్నారని, అత్యవసర పరిస్థితి అయితే ఫోన్ బయటకు వెళ్లి మాట్లాడాలని వారికి సూచించారు.

అలాగే సభలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు తమ ఫోన్లను సైలెంట్ లో పెట్టుకోవాలని రఘురామ మరో సూచన చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు హర్ట్ కాకుండా.. ఇది విజ్ఞప్తి అని, విజ్ఞప్తులు ఒకటి రెండు సార్లు మాత్రమే ఉంటాయని రఘురామ వారికి తెలిపారు. మరోవైపు అసెంబ్లీలో సెల్ ఫోన్ల నియంత్రణకు టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఓ సూచన చేశారు. సభలో జామర్లు పెట్టాలని డిప్యూటీ స్పీకర్ కు సలహా ఇచ్చారు. దీనిపై రఘురామ స్పందిస్తూ మన బలహీనత జామర్లపైకి నెట్టొద్దంటూ ఆయనకు హితవు పలికారు.












Click it and Unblock the Notifications