అగ్రి గోల్డ్ ఇష్యూ: ఎపి మంత్రిపై దేవినేని నెహ్రూ ఆరోపణ, ఆందోళన
హైదరాబాద్: అగ్రిగోల్డ్ సంస్థ ఖాతాదారులను మోసం చేసిన కేసులో సీఐడీ విచారణ అంటూ హడావిడి చేశారని, తీరా నిందిత సంస్థ నుంచి ముడుపులు తీసుకుని యాజమాన్యాన్ని వదిలేశారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రు అరోపించారు. ఇందుకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా ముడుపుల రాయబారం కూడా నడిపించారని వివరించారు.
ఆధారాలతో సహా అన్ని విషయాలు బయటపెడతామని వెల్లడించారు. కాగా, బాధితులు తమకు తాము దాచుకున్న సొమ్మును ఇప్పించాలని కోరుతూ ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, హైదరాబాదు నగరంలోని పంజాగుట్ట అగ్రిగోల్డ్ కార్యాలయం ఎదుట బాధితులు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. వందలాది మంది బాధితులు ప్లకార్డులతో ధర్నా చేపట్టారు. ఈ వ్యవహారంపై సీఐడీతో కాకుండా సీబీఐ చేత దర్యాప్తు చేయించి నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళనకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మద్దతు తెలిపారు.
తెలంగాణ, ఏపీ, ఒడిశా, తమిళనాడు, కర్నాటక రాష్ర్టాల్లోనూ అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వేలాది మంది నుంచి దాదాపు రూ.7 వేల కోట్ల వరకు వసూలు చేసి అగ్రిగోల్డ్ యాజమాన్యం మోసానికి పాల్పడిందనే ఆరోపణలున్నాయి. అగ్రిగోల్డ్లోని ఏజెంట్ల ద్వారా రూపాయికి రెండు రూపాయలు వస్తుందనే కారణంగా మధ్యతరగతి వారితో పాటు పేదలు కూడా పెట్టుబడులు పెట్టారు. బాధితులను ఎలాంటి నగదు ఇవ్వకుండా అగ్రిగోల్డ్ యాజమాన్యం చేతలెత్తేయడంతో బాధితులంతా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. దీంతో బాధితులు ఆందోళన బాటపట్టారు.
అయితే అగ్రిగోల్డ్ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ప్రభుత్వం చొరవ తీసుకుని అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. అగ్రిగోల్డ్లో పెట్టుబడులు పెట్టిన వారు, అగ్రిగోల్డ్లో ఫ్లాట్లు అమ్మివారు కలిసి సోమవారంనాడు విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.