వనజాక్షి ఇష్యూ: దేవినేని చర్చలు, బాబు వద్దే తేల్చుకుంటామని స్టాఫ్
విజయవాడ: కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి వివాదంపై రాజీ చేయడంలో ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు విఫలమైనట్లు కనిపిస్తున్నారు. ఇరు వర్గాల వాదలను విన్నామని, సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పరిష్కరిస్తారని ఆయన అన్నారు.
సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యతను చంద్రబాబు నాయుడు మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, టిడిపి నాయకుడు వల్లభనేని వంశీలకు అప్పగించారు. దాంతో కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్పై దాడి ఘటనలో ఆందోళనకు దిగిన రెవెన్యూ ఉద్యోగులతో మంత్రి దేవినేని ఉమా, వల్లభనేని వంశీ చర్చలు జరిపారు.
ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్ చేయాల్సిందేనని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబట్టారు. అలాగే వనజాక్షిపై కౌంటర్ కేసును ఉపసంహరించుకోవాలని, దాడి సమయంలో మౌనంగా ఉన్న పోలీసును సస్పెండ్ చేయాలన్న తమ డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు. రెవెన్యూ ఉద్యోగులు తమ డిమాండ్లపై పట్టుబట్టి కూర్చోవడంతో సమస్య కొలిక్కి రాలేదు.
వనజాక్షిపై శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ చేసిన దాడి ఘటనపై సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామని, ఆ తర్వాత తమ భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకుంటామని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పారు. కొంత మేరకు చర్చలు ఫలప్రదమైనట్లు చెబుతున్నారు. ఎమ్మార్వోపై, ఇతరు సిబ్బందిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోనున్నట్లు దేవినేని చెప్పారని వారన్నారు.
ముఖ్యమంత్రి వద్దకు వనజాక్షిని, రెవెన్యూ ఉద్యోగ సంఘాల జిల్లా నాయకులను సోమవారం తీసుకుని వెళ్తానని మంత్రి చెప్పినట్లు వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని, తీవ్రంగా ఖండిస్తున్నామని దేవినేని ఉమ తెలిపారు.
మహిళా తహసీల్దార్పై దాడి విచారకరమని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. దాడి ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు. శుక్రవారం మంత్రి దేవినేనితో రెవెన్యూ ఉద్యోగులు జరిపిన చర్చలు విఫలయ్యాయి. తహసీల్దార్పై దాడి చేసినవారిని అరెస్ట్ చేసేవరకు ఆందోళనలు విరమించబోమని వారు స్పష్టం చేశారు. సాయంత్రం మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని రెవెన్యూ ఉద్యోగులు తెలిపారు.
దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు చెప్పారు. ఈ వివాదంపై సోమవారం సీఎం చద్రబాబు నాయుడుతో చర్చిస్తానని, రెండు జిల్లాల సరిహద్దు వివాదంపై మాట్లాడుతామని ఆయన తెలిపారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు కొంత సంయమనం పాటించాలని దేవినేని ఉమా ఉద్యోగులను కోరారు.
తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడి చేశారని ఆరోపిస్తున్న కృష్మా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి ఆయన ఆమెకు ఫోన్ చేసి దాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.