జగన్ రాజ ద్రోహానికి పాల్పడుతున్నారు, చేసి చూపిస్తాం: దేవినేని ఉమ
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపి మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. తాము రాజధాని నిర్మాణం చేపడుతుంటే.. జగన్ దీక్ష పేరిట ప్రజలన మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
సెక్యూరిటీ లేకుండా ఏపి సిఎం చంద్రబాబు గ్రామాల్లోకి వెళితే రాళ్లతో కొడతారన్న జగన్మోహన్ రెడ్డి రాజద్రోహానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి తమను కొట్టేంత దమ్ముందా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి అసాధ్యమనుకున్నవన్నీ తాము సుసాధ్యం చేశామని వివరించారు. 11 సిబిఐ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి తమను విమర్శిస్తున్నారని ఎద్దేశా చేశారు. ఓదార్పు పేరిట యాత్రలు చేసేందుకు.. ఎవరు చనిపోతారా? అని జగన్ గోతికాడ నక్కలా కాచుకు కూర్చుంటున్నారని ఆరోపించారు.
ఏపిలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మంచి జరగాలనే కోరుకుంటున్నామని దేవినేని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2018నాటికి పోలవరం పూర్తి చేస్తామని తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమానికి రైతులు వేలాదిగా తరలివస్తున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications