రఘవీరాపై మండిపాటు, దీక్షల పేరుతో జగన్ దొంగనాటకం: దేవినేని
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ దొంగ దీక్షలతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాడని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖా మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యాసంస్ధలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో వైయస్ జగన్ దీక్ష పేరుతో దొంగనాటకం ఆడుతున్నారంటూ మండిపడ్డారు.
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది జలాల తరలింపుతో కృష్ణా డెల్టాలో మొత్తం 7.30 లక్షల ఎకరాల్లో పంటలను కాపాడుతామని మంత్రి దేవినేని తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాలకు మంచినీరివ్వడం ప్రతిపక్ష పార్టీలకు ఇష్టం లేనట్లుగా ఉందని ఆయన విమర్శించారు.
సాగునీటి సంఘాల ఎన్నికలపై ఏపీసీసీ చీఫ్ రఘవీరా రెడ్డి గవర్నర్ నరసింహాన్కు ఫిర్యాదు చేయడం అప్రజాస్వామికమన్నారు. కాంగ్రెస్ పార్టీ హాయంలో అసలు నీటి సంఘాలకు ఎన్నికలే జరగలేదన్నారు. దీంతో సాగునీటి సంఘాలన్నీ నిర్వీర్యం అయ్యాయన్నారు.
తమ ప్రభుత్వం సాగునీటి సంఘాల ఎన్నికల బాధ్యతను రైతులకు అప్పగించిందన్నారు. ఈ నీటి సంఘాల ఎన్నికలపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తుందన్నారు.
గుంటూరు భారీ వర్షం
గుంటూరులో ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తుంది. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడగా, పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకు ఒరగడంతో చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
లోతట్టు ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు అడుగుల మేరకు నీరు చేరింది. మూడు ప్రాంతాల్లో గోడలు విరిగిపడి కొంత మేర ఆస్తినష్టం జరిగింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.