ఉత్తరాంధ్రకు ద్రోహం, లక్నోలో 2 వేల కోట్లతో మాల్, విశాఖ మాల్ రద్దు: దేవినేని ఉమా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఇటీవల విశాఖ కంటకుడు చంద్రబాబు పేరుతో విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఉత్తరాంధ్రకు చంద్రబాబు చేసిన న్యాయం గురించి వరసగా పోస్టులు చేశారు. అయితే ఉత్తరాంధ్రకు ద్రోహం చేసింది తాము కాదని.. వైసీపీ ప్రభుత్వమేనని దేవినేన ఉమా ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలను కావాలనే రద్దు చేశారని ఆరోపించారు.
2 వేల కోట్లతో మాల్..
లక్నోలో 2 వేల కోట్ల రూపాయలతో లులు గ్రూప్ మాల్ నిర్మిస్తోందని దేవినేని ఉమా తెలిపారు. దానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. అయితే రాష్ట్రంలోనూ ఇలాంటి నిర్మాణాల కోసం గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగిందని తెలిపారు. కానీ వాటిని జగన్ సర్కార్ రద్దు చేశారని విమర్శలు గుప్పించారు. ఆ మాల్ నిర్మిస్తే ఇక్కడి యువతకు ఉపాధి లభించేది కదా అని అన్నారు. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగం కల్పించడం మీకు ఇష్టం లేదా అని దేవినేని ఉమా.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అంతాకంటే పెద్ద మాల్..
విశాఖపట్టణం బీచ్ రోడ్డులో దీనికంటే పెద్ద మాల్ హోటల్ నిర్మాణానికి గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని దేవినేని ఉమా గుర్తుచేశారు. దానిని కొనసాగించాల్సింది పోయి.. రద్దు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖ అభివృద్ధి అంటే మీకు గిట్టదా అని ప్రశ్నించారు. విశాఖపట్టణం కాక, శ్రీకాకుళం, విజయనగరం 10 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి అని తెలిపారు. కానీ అడ్డుపడింది ఎవరని ప్రశ్నించారు. దీంతో నిజమైన ఉత్తరాంధ్ర ద్రోహి ఎవరో అర్థమవుతుందని చెప్పారు.
మేం కొలిక్కి తీసుకొస్తే.. మీరు
పనిలో పనిగా బందర్ పోర్ట్ గురించి కూడా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ హయాంలో నవయుగకు బందరుపోర్ట్ కాంట్రాక్ట్ ఇస్తే ఏళ్ల తరబడి పూర్తి కాలేదు. కనీసం భూసేకరణ కూడా చేపట్టలేదు. కానీ తమ ప్రభుత్వ హయాంలో భూసేకరణ కొలిక్కి తీసుకొచ్చామని తెలిపారు. పనులు కూడా ప్రారంభించామని.. కానీ వైసీపీప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ రద్దు చేసిందని తెలిపారు. అంతేకాదు బందర్ పోర్ట్కు అన్యాయం చేస్తోంది వైసీపీ సర్కార్ అని దేవినేని ఉమ మండిపడ్డారు.