అదో చెత్త కమిటీ.. జగన్ తుగ్లక్ చర్యలు మానుకోవాలి.. : దేవినేని ఉమా
ఏపీ రాజధాని అంశంపై బోస్టన్ కమిటీ ఇచ్చే నివేదికను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. నివేదికను అధ్యయనం చేసి హైపవర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
ఈ నేపథ్యంలో హైపవర్ కమిటీ ఏర్పాటును టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి,టీడీపీ నేత దేవినేని ఉమా ఈ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ స్వార్థ ప్రయోజనాలకోసం రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయవద్దన్నారు.

హైపవర్ కమిటీపై విమర్శలు
ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీని చెత్త కమిటీ అని దేవినేని ఉమా విమర్శించారు. జగన్ నిర్ణయాలను తుగ్లక్ చర్యలుగా అభివర్ణించారు. జగన్ తీవ్ర అభద్రతా భావంలో ఉన్నాడని,అమరావతి అభివృద్ది చెందడం చూడలేకనే రాజధానిని తరలిస్తున్నాడని విమర్శించారు. ఎన్నికల ప్రణాళికలో పెట్టకుండా.. ఓట్ల సమయంలో ప్రజల ముందు పెట్టకుండా.. రాజధాని మార్పుపైఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. అమరావతిలో రాజధాని కోసం ప్రభుత్వం ఇప్పటికే అక్కడ రూ.5వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.

విశాఖలో కల్లోలం రేపుతారా..? :
విశాఖపట్నం చాలా ప్రశాంతమైన నగరం అని, ఆ ప్రశాంతతను చెదరగొట్టేందుకు సీఎం జగన్ అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలతో కల్లోలం రేపబోతున్నారని దేవినేని ఆరోపించారు. రాజధాని మార్పునిర్ణయంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని ఇంటలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకే.. విశాఖ పర్యటనలో జగన్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారని అన్నారు.

రియల్ ఎస్టేట్ వెంచర్ కాదు.. రాజధాని..:
రాజధాని అంటే రియల్ ఎస్టేట్ వెంచర్ కాదని,ఆంధ్రుల భవిష్యత్ అని దేవినేని అన్నారు. విశాఖలో ఇప్పటికే వేల ఎకరాల భూములు చేతులు మారాయన్నారు. విజయసాయి రెడ్డి అనే రాజకీయ బ్రోకర్నిపెట్టి భూ దందాలు చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారాలన్నింటిపై భవిష్యత్లో పున:పరిశీలన ఉంటుందని,సీబీఐ విచారణలు జరుగుతాయన్న సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు. రాజధాని అమరావతిలోనేఉంటే అందరికీ సమదూరంలో ఉంటుందని,విశాఖకు తరలిస్తే కొన్ని ప్రాంతాలకు రాజధాని 1000కి.మీ దూరం అవుతుందని అన్నారు. సామాన్యుడు ఏదైనా పని నిమిత్తం రాజధానికి రావాలంటే నాలుగు రోజులుల వెచ్చించాల్సి వస్తుందన్నారు.అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన బోస్టన్ కంపెనీని రాజధానిపై అధ్యయనం చేయాల్సిందిగా ఎలా కోరుతారని ప్రశ్నించారు.

ప్రాణ త్యాగానికైనా సిద్దం :
అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని,అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్దమేనని దేవినేని ఉమా అన్నారు. కేవలం కక్షపూరిత రాజకీయాలతో రాజధాని మార్పుపై నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.
మనంలో మనం కొట్టుకుంటుంటే పక్క రాష్ట్రం వాళ్లు తమ రాష్ట్రం మరింత అభివృద్ది చెందుతుందని సంతోషపడుతారన్నారు. ఇకనైనా తెలివి తక్కువ నిర్ణయాలు మానుకుని రాజధానిని అమరావతిలోనే
కొనసాగించేందుకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications