దేవినేని ఉమాకు కరోనా; టీడీపీ నేతలపై కరోనా పంజాతో తెలుగు తమ్ముళ్ళకు ఆందోళన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ నేతలను కరోనా పట్టిపీడిస్తోంది. తెలుగుదేశం పార్టీలో కరోనా కలకలం నెలకొంది. ఇప్పటికే కరోనా మహమ్మారి బారిన పడిన నారా లోకేష్, తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని చెప్పారు. టిడిపి చీఫ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కరోనా బారిన పడి ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతుంటే, తాజాగా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.
దేవినేని ఉమాకు కరోనా... ఐసోలేషన్ లో ఉమా
తనకు స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాను అని, తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని దేవినేని ఉమ వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పిన దేవినేని ఉమా, వైద్యుల సూచనలతో తాను హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా దేవినేని ఉమా వెల్లడించారు. ఇక గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దేవినేని ఉమా పేర్కొన్నారు.
కరోనా బారిన పడిన చంద్రబాబు, లోకేష్
ఇదిలా ఉంటే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కరోనా స్వల్ప లక్షణాలున్నాయని ఇటీవల తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని, తాను ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లుగా చంద్రబాబు పేర్కొన్నారు. అంతకుముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. ఇక వీరు మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు.
టీడీపీ నేతలకు కరోనా ... తెలుగు తమ్ముళ్లలో ఆందోళన
మరోవైపు అనంతపురం జిల్లా కు చెందిన యువ నేత పరిటాల శ్రీరామ్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం పరిటాల శ్రీరామ్ హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. అంతకు ముందు టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, వంగవీటి రాధా కూడా కరోనా బారినపడ్డారు. వీరంతా హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కాలంలో లోకేష్ ను, చంద్రబాబును, దేవినేని ఉమను కలిసిన వారంతా వారికి కరోనా నిర్ధారణ కావడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. టీడీపీ నేతలను కరోనా పట్టి పీడిస్తుందని తాజా పరిణామాలతో అర్ధం అవుతుంది.