ఢిల్లీకి వెళ్లి రాద్ధాంతమా?, ఏం బాగోలేదు: హరీశ్ రావుపై మండిపడిన దేవినేని
అమరావతి: సాగునీటి ప్రాజెక్టులు, నీటి పంపకాలు, కృష్ణాబోర్డ్పై ఫిర్యాదు అంశాలపై తెలంగాణ నేతల తీరు బాగోలేదని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. తెలంగాణ నేతలు ఢిల్లీ వెళ్లి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
మంత్రి ఉమా మంగళవారం మాట్లాడుతూ.. తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులు జరిగాయని, కేటాయింపుల్లో కృష్ణానదీ యాజమాన్య బోర్డు జాగ్రత్తలు తీసుకోవాలని సంతకాలు జరిగాయని గుర్తు చేశారు. బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు అనుగుణంగా 512 టీఎంసీలు రాష్ట్రానికి కేటాయింపులు జరిగాయని వివరించారు.
కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. విభజన ప్రకారమే కృష్ణా బోర్డు నడుస్తుందన్నారు.
విభజన చట్టాన్ని రూపొందించింది టిఆర్ఎస్సేనని, ఇప్పుడెందుకు జలాల పంపిణీపై దుష్ప్రచారం చేస్తున్నారని దేవినేని ఉమా ప్రశ్నించారు. సాగునీటి పంపకాల అంశంపై తాము చర్చకు సిద్ధమని దేవినేని ఉమా స్పష్టం చేశారు.
కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ సోమవారం తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్రమంత్రి ఉమాభారతిని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉమామహేశ్వరరావు విమర్శలు చేసినట్లు తెలుస్తోంది.