సమావేశానికి చిరంజీవి డుమ్మా: మాస్ అంటూ దేవినేని నెహ్రూ వివరణ
విజయవాడ: మెగాస్టార్ చిరంజీవి మాస్ లీడరని, ఆయన చరిష్మాను ఎన్నికల్లో ఉపయోగించుకుంటామని ఆంధ్రప్రదేశ్ పిసిసి ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ అన్నారు. ప్రస్తుతం చిరంజీవి సినిమాలపై దృష్టి పెట్టారని అందుకే విజయవాడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి రాలేకపోయారని ఆయన వివరించారు.
గాలేరు-నగరి ప్రాజెక్టులతో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, పార్లమెంటు సభ్యుడదు సీఎం రమేష్లపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టిసీమ నుంచి కృష్ణా బ్యారేజీకి ఒక చుక్క నీరు కూడా రాలేదని నెహ్రూ వ్యాఖ్యానించారు.

ప్రాజెక్టుల పేరు చెప్పుకుని కోట్లాది రూపాయల్ని కమీషన్ పేరిట దండుకున్నారని నెహ్రూ మండిపడ్డారు. బుడమేరు నీటిని కృష్ణా నదికి తరలించి పట్టిసీమ నీరుగా చెప్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా, శుక్రవారం విజయవాడలో పిసిసి విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
ఆ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో పాటు సి రామచంద్రయ్య తదితర నాయకులు హాజరయ్యారు. చిరంజీవి మాత్రం రాలేదు. ప్రత్యేక హోదా కోసం చేయాల్సిన పోరాటం గురించి ఆ సమావేశంలో కాంగ్రెసు నాయకులు చర్చించారు.












Click it and Unblock the Notifications