BrahMos విశ్వరూపం.. ఆ దేశాల రక్షణ ఇక భారత్ చేతుల్లో!
దశాబ్దాల తరబడి ప్రపంచంలోనే అత్యధికంగా సైనిక సామాగ్రిని దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో ముందుండే భారత్, ఇప్పుడు ఆ ముద్రను చెరిపేసుకుంటోంది. సొంతంగా తయారు చేసిన అత్యాధునిక ఆయుధాలను విదేశాలకు విక్రయిస్తూ రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీ ఈ ఆర్థిక సంవత్సరంలో (2025-26) ఏకంగా రూ.1.78 లక్షల కోట్ల ఆల్టైమ్ హై రికార్డును తాకింది.
ఇందులో రక్షణ రంగ ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే 60 శాతానికి పైగా పెరగడం విశేషం. రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.23,622 కోట్లుగా ఉన్న ఎగుమతులు, ఈసారి 62.66 శాతం వృద్ధితో రికార్డు స్థాయిలో రూ.38,424 కోట్లకు చేరుకున్నాయి.
'బ్రహ్మోస్' క్షిపణికి పెరుగుతున్న క్రేజ్
భారత రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల ఒక కీలక మైలురాయి నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా, భారత్ నుంచి అత్యాధునిక 'బ్రహ్మోస్' సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు ఇండోనేషియా అధికారికంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఫిలిప్పీన్స్, వియత్నాంల తర్వాత ఈ క్షిపణిని కొనుగోలు చేస్తున్న మూడో అంతర్జాతీయ దేశం ఇదే.

సుమారు 200 మిలియన్ డాలర్ల నుంచి 630 మిలియన్ డాలర్ల విలువైన ఈ రక్షణ ఒప్పందంలో క్షిపణి బ్యాటరీలు, తీరప్రాంత రక్షణ వ్యవస్థలు మరియు శిక్షణ కూడా భాగం. భారతదేశపు బ్రహ్మపుత్ర, రష్యాకు చెందిన మోస్క్వా నదుల పేర్ల మీదుగా పిలిచే ఈ బ్రహ్మోస్ క్షిపణి శత్రు నౌకలను ముంచేయడంలో అత్యంత వేగవంతమైనది.
అంతర్జాతీయ మార్కెట్లో 'పినాక, ఆకాశ్' హవా
క్షీపణులతో పాటు భారత్ తయారు చేసిన 'పినాక' రాకెట్ లాంచర్ వ్యవస్థకు కూడా ప్రపంచ మార్కెట్లో మంచి గిరాకీ ఏర్పడింది. అర్మేనియా దేశం 2022 లో సుమారు రూ.2,000 కోట్ల విలువైన నాలుగు పినాక రాకెట్ లాంచర్ బ్యాటరీల కోసం ఒప్పందం చేసుకోగా, వీటికి సంబంధించిన గైడెడ్ రాకెట్ వ్యవస్థల మొదటి విడత సరఫరాను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఏడాది జనవరిలో జెండా ఊపి ప్రారంభించారు.
నాగ్పూర్ ఫెసిలిటీలో తయారయ్యే ఈ పినాక వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ఇప్పుడు ఫ్రాన్స్ దేశం కూడా ఆసక్తి చూపుతోంది. మరోవైపు, శత్రువుల డ్రోన్లు, ఫైటర్ జెట్లను గాల్లోనే కూల్చేసే స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 'ఆకాశ్' క్షిపణులను కొనుగోలు చేసిన మొదటి విదేశీ దేశంగా అర్మేనియా ($720 మిలియన్ల ఒప్పందం) నిలిచింది.
ఇండో-పసిఫిక్ రీజియన్పై పట్టు
ప్రస్తుతం భారతీయ ఆయుధాలకు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అత్యధిక డిమాండ్ ఉంటోంది. ముఖ్యంగా మయన్మార్, ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలు భారత్ నుంచి భారీగా ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాయి. 2020-2025 మధ్యకాలంలో భారత రక్షణ ఎగుమతుల్లో ఈ మూడు ఆగ్నేయాసియా దేశాల వాటానే ఏకంగా 70.1 శాతంగా ఉండటం గమనార్హం.
ఒక దశాబ్దం క్రితం, అంటే 2014 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.700 కోట్లుగా ఉన్న భారత రక్షణ ఎగుమతులు, నేడు దాదాపు 50 రెట్లు పెరిగాయని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక పేర్కొంది. అంతేకాకుండా, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెరుగుతున్న సైనిక వ్యయాల నేపథ్యంలో రాబోయే 2029 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్ రక్షణ ఎగుమతులు రూ. 50,000 కోట్లకు చేరుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications