వివేకా హత్యకేసులో సీబీఐకి సవాల్ గా మారిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏ-5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కేంద్ర దర్యాప్తు సంస్థకు సవాల్ గా మారారు. కేసు చిక్కుముడులు పడటానికి, దర్యాప్తు ఒక కొలిక్కి రాకపోవడానికి ఆయనే కారణమని సీబీఐ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఆయన ఏ-5గా ఉన్నారు. మే 26వ తేదీన తాత్కాలిక బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఆయన ఫొటోలతో పులివెందుల మొత్తం భారీగా ఫ్లెక్సీలు వేయించారు. ఇది ఒకరకంగా సాక్షులను ప్రభావితం చేయడమేననేది సీబీఐ ప్రధాన ఆరోపణ.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు..
సీబీఐ దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం... దేవిరెడ్డి శివశంకర్రెడ్డి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వివేకానందరెడ్డి హత్య జరిగినరోజు పనిమనిషిని పిలిపించి రక్తాన్ని శుభ్రం చేయించడంతోపాటు శరీరంపై గాయాలు కనపడకుండా కాంపౌండర్ ను పిలిపించి కుట్లు వేయించారు.
కేసు నమోదు చేయకుండా పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతో అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. మే 26న తాత్కాలిక బెయిల్ పై బయటకు వచ్చినప్పుడు రాజకీయ నాయకులతోపాటు ఒక ఇన్ స్పెక్టర్ కూడా ఆయన్ను కలిశారు. ఆ తర్వాత నాలుగు రోజులకే అప్రూవర్ గా మారిన దస్తగిరిపై కేసు నమోదు చేశారు. ఇవన్నీ దేవిరెడ్డి ప్రోద్భలంతోనే జరుగుతున్నాయని సీబీఐ తన నివేదికలో కూడా పొందుపరిచింది.
ఫిజియో థెరపీ పేరుతో బయటకు..
ఫిజియో థెరపీ చేయించుకోవాలనే పేరుతో బయటకు వస్తూ సాక్షులను ప్రభావితం చేస్తున్నారనేది సీబీఐ ప్రధాన ఆరోపణగా ఉంది. బయటకు వచ్చినప్పుడు సాక్షులను కలవడం, వారిని అనుకూలంగా మార్చుకోవడం సర్వసాధారణంగా జరిగిపోతోందని భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న తమనే బెదిరించారంటే సాక్షులను బెదిరించడం దేవిరెడ్డికి అసాధ్యమేమీ కాదనేది సీబీఐ అధికారుల అభిప్రాయంగా ఉంది.
డ్రైవర్ చేసిన ఫిర్యాదుపై ఇంతవరకు చర్యలు లేవు
కేసు దర్యాప్తులో భాగంగా కడప సెంట్రల్ జైల్ నుంచి వస్తున్న సీబీఐ అధికారుల వాహనాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆపారు. డ్రైవర్ను బెదిరించడంతోపాటు అధికారులను కూడా పులివెందుల, కడప వదిలివెళ్లిపోవాలని హెచ్చరించిన సంగతి తెలిసిందే. డ్రైవర్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఈ ఫిర్యాదుపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు.
ఈ కేసులో ఏ-1గా ఉన్న గంగిరెడ్డికి బెయిల్ ఇచ్చారు కాబట్టి తనకు కూడా బెయిల్ ఇవ్వాలంటూ దేవిరెడ్డి కోరడం సమంజసం కాదంటూ హైకోర్టులో దేవిరెడ్డికి బెయిల్ రాకుండా సీబీఐ అడ్డుకుంటోంది. తాజాగా ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. వివేకానందరెడ్డి కుమార్తె సునీత తరఫు న్యాయవాది కూడా వివేకానందరెడ్డి హత్యకు ప్రణాళిక రూపొందించడం నుంచి సాక్ష్యాధారాలు ధ్వంసం చేసేవరకు దేవిరెడ్డిదే ప్రధాన పాత్ర అని తన వాదనలు వినిపించారు.