టీటీడీ ఉద్యోగుల సెలవులు రద్దు: అలిపిరి టోల్ ప్లాజా వద్ద..!!
తిరుమలలో భక్తుల విపరీత రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో రెట్టింపు సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటోన్నారు. తిరుమల కొండ కిటకిటలాడుతోంది. దీనికి తగ్గట్టుగా ప్రైవేట్, వ్యక్తిగత వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. శనివారం 85,582 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 44,155 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.43 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. బాటగంగమ్మ ఆలయం వరకూ క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 30 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే రికార్డు స్థాయిలో 4.66 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అదే స్థాయిలో 3.43 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీటిని అందిస్తున్నారు.

తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అమితంగా ఉండటంతో అలిపిరి సెక్యూరిటీ తనిఖీ కేంద్రం వద్ద తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వాహనాల రాకపోకలు పూర్తిగా నెమ్మదించాయి. అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలో వాహనాలు ముందుకు కదలడానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలిపిరి వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం తప్పనిసరి.
లగేజీ స్కాన్ చేయడం, నిషేధిత వస్తువులు లేవని నిర్ధారించుకోవడం వంటి భద్రతా నియమాల వల్ల సహజంగానే కొంత సమయం పడుతుంది. పీక్ సీజన్లో ఒకేసారి వేలాది ప్రైవేట్ వాహనాలు అలిపిరి సెక్యూరిటీ చెక్ పోస్టు వైపు దూసుకురావడంతో, కపిలతీర్థం, లీలామహల్ బైపాస్ రోడ్లపై భారీ వాహనాల సందడి నెలకొంది.
ఈ పరిణామాలపై అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. పాచికాల్వ గంగమ్మ గుడి సర్కిల్ వద్ద క్యూ లైన్లను పర్యవేక్షించారు. తిరుమలలో సాధారణ రోజుల్లో సైతం రోజుకు సగటున 85 వేల నుంచి 87 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నామని అన్నారు. శనివారం లక్షన్నర మందికి పైగా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్న పరిస్థితి ఏర్పడిందని, ఇంత భారీ సంఖ్యలో భక్తులు ఒకేసారి రావడంతో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పరిస్థితిని పూర్తిస్థాయిలో అదుపులో ఉంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని వెంకయ్య చౌదరి తెలిపారు. ఇందులో భాగంగా అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేశామని అన్నారు. అందరినీ తిరుమలలోనే విధుల్లో కొనసాగిస్తున్నామని, అదనపు పోలీసు బలగాలను కూడా మోహరించినట్లు పేర్కొన్నారు.
సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించేందుకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆన్ లైన్ లో ఏరోజుకారోజు కరెంట్ బుకింగ్ లో జారీ చేసే 800 శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను రద్దు చేసినట్లు అదనపు ఈవో తెలిపారు. అలాగే ఎస్ఎస్డీ తదితర దర్శనాల కోటాలను కూడా అవసరానికి అనుగుణంగా తగ్గించి, ఆ సమయాన్ని సర్వదర్శనం భక్తులకు వినియోగిస్తున్నామని వివరించారు.












Click it and Unblock the Notifications