పిఠాపురంలో అధ్వానంగా ఆలయం..సనాతన ధర్మం పాఠాలు మనకెలా..?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని, సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేస్తే, ఈ వివాదాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది మాత్రం పవన్ కల్యాణే. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందని ఆయన 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తిరుపతిలో వారాహి డిక్లరేషన్ కూడా ప్రకటించారాయన. తాను బలమైన సనాతన ధర్మం పాటించేవాడనని ఆయన చెప్పుకొచ్చారు.
హిందూ ధర్మాన్ని కాపాడటానికి తాను ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాననంటూ చాలా గొప్పగా మాట్లాడారు. హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించడంతో పాటు, వాటికి ప్రత్యేక నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా కోరారు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గంలోని ఓ గుడి అధ్వానంగా ఉండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పవిత్ర పాదగయ ఆలయం అధ్వానంగా మారింది. పాదగయ ఆలయానికి గతంలో భక్తులు వేలాదిగా తరలివచ్చేవారు.

కానీ సరైన నిర్వహణ లేకపోవడంతో భక్తుల సంఖ్య క్రమేపి తగ్గిపోతూ వస్తోంది. దేవీ నవరాత్రుల సమయంలోనూ ఆలయాన్ని పట్టించుకున్న నాథుడు లేరు. ఆలయం చుట్టూ చెత్తా, చెదారం, మురికి పేరుకుపోయింది. శివరాత్రి తర్వాత ఆలయాన్ని శుభ్రం చేసింది లేదని భక్తులు చెబుతున్నారు. ఆలయం పుష్కరిణి నీళ్లను కూడా శుభ్రం చేయలేదని.. నీలం రంగులో ఉండాల్సిన నీళ్లు నల్లగా మారాయని భక్తులు మండిపడుతున్నారు. పుష్కరిణిలో స్నానం చేస్తే ఒళ్లంతా దురదలు వస్తున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరిందని భక్తులు ధ్వజమెత్తారు.
నిత్యం పూజలు చేసే శివలింగం, నందీశ్వరుడి విగ్రహాలపై కుక్కలు మూత్ర విసర్జన చేస్తున్నాయని , అయిన అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.ఆలయంలో యధేచ్ఛగా శునకాలు సంచరిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్కు భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై వైసీపీ నాయకులు రియాక్ట్ అవుతూ.. సనాతన ధర్మం పాటించడం అంటే ఇదేనా అంటూ పవన్ కల్యాణ్ను ప్రశ్నిస్తున్నారు. సనాతన ధర్మం గురించి పాఠాలు చెప్పడం కాదని, దాన్ని ఆచరణలో పెట్టి చూపించాలని పవన్కు వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. డిప్యూటీ సీఎం నియోజకవర్గంలోనే ఆలయ పరిస్థితి ఇలా ఉందంటే , ఇక రాష్ట్రంలో ఆలయాల పరిస్థితి ఏంటని వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని కేవలం తన రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని వైసీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications