జగన్ యాత్రపై బాబు కుట్రలు, ఏపీ సర్కారుదే ఆ ఘనత: ధర్మాన తీవ్ర విమర్శలు
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
Recommended Video


టీడీపీ కుట్రలు
గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ... నవంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న ప్రజా సంకల్ప యాత్రకు ఆటంకాలు కల్పించేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతోందన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్లే హక్కు జగన్కు ఉందన్నారు. ప్రజలను చైతన్యపరచడం ప్రతిపక్షంగా తమ బాధ్యతని అన్నారు.

ఏకైక ప్రభుత్వం బాబుదే..
టీడీపీ మితిమీరిన వ్యవహారాలు చేస్తోందని, పాదయాత్రను అడ్డుకోవాలనుకోవడం దుర్మార్గమని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులు మంత్రులుగా ఉన్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబుదేనని దుయ్యబట్టారు.

భ్రష్టుపట్టిస్తున్నారు..
చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఇప్పటివరకు 2 వేల రహస్య జీవోలు విడుదల చేసిందని ధర్మాన తెలిపారు. రాజ్యాంగ ఉల్లంఘనలతో వ్యవస్థలను చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. శాసనసభలో మాట్లాడనీయకుండా ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని, ఇలాంటి సందర్భంలో ప్రజలను జాగృతం చేయాల్సిన బాధ్యత విపక్షానిదేనని అన్నారు.

ప్రజల ముందు ఎండగడతారు..
సుమారు 6నెలల పాటు జరిగే పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని, అక్రమాలను, చట్టవ్యతిరేక చర్యలను ప్రజలకు జగన్ వివరిస్తారని చెప్పారు. పాదయాత్రకు అందరూ సహకరించాలని ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. నవంబర్ 6నుంచి 6నెలలపాటు జగన్ పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications