మంత్రి ధర్మాన సంచలనం - పదవికి రాజీనామా : ఉద్యమంలోకి ఎంట్రీ..!!
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. మూడు రాజధానుల వ్యవహారంలో భారీ ట్విస్టు ఇచ్చారు. ఏపీలో రాజకీయాలు ఇప్పుడు మూడు రాజధానులు చుట్టూ తిరుగుతున్నాయి. అమరావతి మహా పాదయాత్ర మరికొద్ది రోజుల్లో ఉత్తరాంధ్రలో ప్రవేశించనుంది. ఈ యాత్ర ప్రారంభం నుంచి వైసీపీ నేతలు మూడు రాజధానుల అంశాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా జేఏసీ ఏర్పాటుకు నిర్ణయించారు. ఉత్తరాంధ్ర మంత్రులు సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు.
రాజీనామా చేసి ఉద్యమంలోకి
అందులో భాగంగా ఇప్పుడు సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాద రావు మూడు రాజధానుల వ్యవహారం రాజకీయంగా కొత్త టర్న్ తీసుకొనేలా సంచలన వ్యాఖ్యలు చేసారు. విశాఖ రాజధాని కోసం అవసరమైతే రాజీనామా చేస్తానని మంత్రి ధర్మాన ప్రకటించారు. ముఖ్యమంత్రి అనుమతిస్తే తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేసారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే వచ్చే నష్టం ఏంటని ప్రతిపక్షాలను ప్రశ్నించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన అనంతరం రాష్ట్రానికి రాజధాని వెతుక్కోవాల్సి వచ్చిందని ధర్మాన గుర్తు చేసారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని ఆ రోజు కేంద్రం నియమించిన కమిటీలు సిఫార్సు చేసాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తెలివిగా తనదైన రాజకీయం చేస్తున్నారని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేసారు.
చంద్రబాబు వద్దని చెబితే ఎలా
తమ బిడ్డల భవిష్యత్ కోసం ఆలోచించాలని ఉత్తరాంధ్ర వాసులను ధర్మాన సూచించారు. పరిస్థితులు ఆవేదన కలిగిస్తున్నాయని..భవిష్యత్ తరాలకు నష్టం కలగకూడదనే తమ ఆవేదన అంటూ వివరించారు. విశాఖ కు రాజధాని వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతం అనూహ్యంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. 130 ఏళ్ల తరువాత రాజధాని ఏర్పాటయ్యే అవకాశం వస్తే చంద్రబాబు వద్దని చెబితే ఎలా అంటూ నిలదీసారు.
అమరావతి నుంచి ఇక్కడికి యాత్రగా వస్తున్నారని.. మీకు రాజధాని వద్దు.. మీకు అభివృద్ధి వద్దు అని అక్కడి నుంచి వచ్చిన వాళ్లు ఇక్కడ చెబితే మన నోట్లో మట్టి కొడితే ఎలా అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుని మాకు అన్యాయం చేస్తామని చెప్పడం తగదంటూ వ్యాఖ్యానించారు. ఎవరి దగ్గరా తలవంచాల్సిన పని లేదని, విపక్షాల విష ప్రచారాన్ని తిప్పికొట్టండని ధర్మాన పిలుపునిచ్చారు.
లక్షలాది మంది వెనుక వస్తారు
తాను రాజీనామా చేసి ఉద్యమంలోకి వస్తే లక్షలాది మంది తన వెనుక వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి పౌరుడూ చైతన్యవంతం కావాలని ధర్మాన సూచించారు. ఇప్పుడు సీనియర్ మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో సంచలనంగా మారాయి. మిగిలిన మంత్రులు ఇదే రకమైన ప్రకటనలకు సిద్దమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం శ్రీకాకుళం జిల్లా వేదికగా పరిపాలనా వికేంద్రీకరణ పైన రౌండ్ టేబుల్ జరగనుంది. ఈ సమావేశంలో స్థానికంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.
ధర్మాన వ్యాఖ్యల తరువాత జరుగుతున్న సమావేశం కావటంతో..ఈ రౌండ్ టేబుల్ వేదికగా మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ధర్మాన వ్యాఖ్యల పైన ప్రతిపక్ష టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి. రాజకీయంగా మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు రోజు రోజుకూ హీట్ పెంచుతోంది.