విజనరీ చంద్రబాబు.. ప్రిజనరీ జగన్; పదోతరగతి ఫలితాలతో తేడా తెలుస్తుందన్న ధూళిపాళ్ళ నరేంద్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలు ఏపీ రాష్ట్ర ప్రజలను ఒక్కసారిగా షాక్ కు గురిచేశాయి. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా పదో తరగతి పరీక్షా ఫలితాలు రావడం, ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ కావడం పై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుంది. పదో తరగతి పరీక్షా ఫలితాలలో విద్యార్థుల ఫెయిల్ కు ఏపీ ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థుల ఆత్మహత్యలకు నైతిక బాధ్యత ప్రభుత్వానిదే
తాజాగా పదో తరగతి పరీక్షా ఫలితాలపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పదో తరగతి పరీక్షల్లో ఘోరంగా ఫెయిలైన జగన్ రెడ్డి అంటూ మండిపడిన దూళిపాళ్ల నరేంద్ర పదో తరగతి ఫలితాలు చూసి చాలామంది పిల్లలు బాధపడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు.
ఫలితాల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడిన ధూళిపాళ్ళ నరేంద్ర దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని ఆయన ఆరోపణలు గుప్పించారు.
దశాబ్ద కాలంలో ఎప్పుడూ ఇంత ఘోర వైఫల్యం చూడలేదు
రాష్ట్రంలో ఐదు వేలకు పైగా పాఠశాలలు మూత పడుతున్నాయని, బడుల మూసివేతతో వెనుకబడిన వర్గాలు విద్యకు దూరం అవుతున్నాయి అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని, మాతృభాషలో బోధనను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఆంగ్ల భాష బోధన వల్ల చిన్నారుల మానసిక వికాసం దెబ్బతింటుందని పేర్కొన్న ధూళిపాళ్ళ నరేంద్ర దశాబ్దకాలంలో ఎన్నడూ ఇంతటి ఘోర వైఫల్యం చూడలేదని వ్యాఖ్యానించారు.
ఫలితాలకు బాధ్యత వహించకుండా తల్లిదండ్రులపై నెడతారా?
ఇక ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన నాడు నేడు పైన పటారం, లోన లొటారం అన్నట్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలుగా భావించాలని ధూళిపాళ్ల నరేంద్ర వెల్లడించారు. పదవ తరగతి పరీక్షా ఫలితాలలో విద్యార్థులు ఫెయిల్ కావడానికి విద్య శాఖ మంత్రి నైతిక బాధ్యత వహించకుండా తల్లిదండ్రులపై నెట్టడం తప్పు అంటూ ధూళిపాళ్ళ నరేంద్ర వ్యాఖ్యానించారు.
చంద్రబాబు హయాంలో విద్యా వ్యవస్థ ఇలా లేదన్న ధూళిపాళ్ళ నరేంద్ర
కరోనా మహమ్మారి కారణంగా ఇతర రాష్ట్రాలు విద్యా ప్రమాణాలను పెంచడానికి ప్రయత్నిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయుల ను వైన్ షాపుల వద్ద ఉంచిందని ధూళిపాళ్ళ నరేంద్ర వ్యాఖ్యానించారు. ఇంగ్లీష్ మీడియంలో చేరాలని విద్యార్థులను బలవంత పెడుతున్నారని, ఇంగ్లీష్ మీడియం వల్ల విద్యార్థుల మానసిక వికాసం దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు. విజనరీ చంద్రబాబుకు ప్రిజనరీ జగన్మోహన్ రెడ్డికి తేడా తెలుస్తుందని పేర్కొన్న దూళిపాళ్ల నరేంద్ర చౌదరి చంద్రబాబు సమయంలో విద్య వ్యవస్థ ఇలాంటి పరిస్థితిలో లేదని తేల్చి చెప్పారు.