నిమ్మగడ్డ పునర్నియామకం జరిగినట్లే.. సుమోటోగా విజయసాయిని దించేసిన జగన్.. టీడీపీ దాడి..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కొనసాగవచ్చంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వివాదం కొనసాగుతోంది. ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టినట్టుగా సర్క్యులర్ 317ను జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్.. గంటల వ్యవధిలోనే తన ఆదేశాలను వెనక్కి తీసుకోవడం, అంతలోనే ప్రసాద్ స్థానంలో వాణీ మోహన్ ను ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించడం చకచకా జరిగిపోయాయి. నిమ్మగడ్డ స్వీయ పునర్నియామకం చెల్లబోదని అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరాం పేర్కొనడం, హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసే దిశగా సర్కారు యోచిస్తున్న నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

అది జరిగినట్లే..
హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకం జరిగిపోయినట్లేనని, అయినాసరే, దీనిపై జగన్ సర్కారు అనవసర రాద్ధాంతం చేస్తున్నదని, తద్వారా న్యాయవ్యవస్థను కించపరుస్తున్నరని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. న్యాయ సలహాదారుగా వ్యవహరించే అడ్వొకేట్ జనరల్ శ్రీరాం.. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఏజీ కార్యాలయాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్డినెన్స్ చెల్లదని హైకోర్టు స్పష్టంగా చెప్పినా, తీర్పు సరిగా లేదనడం, రాజకీయ నేతలాగా ఏజీ ప్రెస్ మీట్ పెట్టడం భావ్యంకాదని ఎంపీ మండిపడ్డారు.

సుమోటోల గోల..
నిమ్మగడ్డ వివాదం నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల మధ్య ఆసక్తికర యుద్ధం కొనసాగుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ఇద్దరు నేతలూ పరస్పరం ఘాటు విమర్శలకు దిగారు. తొలుత, ఎంపీ విజయసాయి.. చంద్రబాబు, నిమ్మగడ్డలను ప్రస్తావిస్తూ.. ‘‘గ్యాస్ బాధితుల్ని పరామర్శిస్తానని సుమోటోగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెనక్కి వెళ్ళాడు ఒకాయన. నాకు నేనే సుమోటోగా ఎన్నికల కమిషనర్ని అని ఆర్డర్ ఇచ్చుకున్నాడు ఇంకొకాయన. అసలు ఈ సుమోటోలు ఏమిటో...!?'' అని ట్వీట్ చేశారు. దీనిపై..

విజయసాయికి అల్జిమర్స్..
వైసీపీ ఎంపీ విమర్శలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా ఘాటుగా స్పందించారు. ‘‘సుమోటో అనే పదం మీకు అర్ధం కాకపోవడం ఏంటి విజయసాయి రెడ్డి? సుమోటోగా 16 నెలలు జైలు శిక్ష.. సుమోటోగా 11 కేసుల్లో ఏ1, ఏ2 ముద్దాయిలుగా ఎదగడం.. ఇవ్వన్నీ సుమోటోగా చేసుకున్న స్వయంకృపరాదాలే కదా!.. అంతెందుకు మొన్న జగన్ గారు సుమోటోగా మిమ్మల్ని కారులోంచి దించేసి విశాఖ బాధ్యతలను తొలగించారని తాడేపల్లి సంస్థానం టాక్.. అన్నట్టు సుమోటోగా చంద్రబాబు గారి విశాఖ పర్యటనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి, వెన్నులో వణుకుపుట్టి వైఎస్ జగన్ గారు ఫ్లైట్స్ రద్దు చేశారు గుర్తులేదా.. సుమోటోగా అల్జిమర్స్ వ్యాధి తెచ్చుకున్నారా సాయిరెడ్డి గారు?'' అంటూ విరుచుకుపడ్డారు.
Recommended Video

టీడీపీ ఎందుకెళ్లింది?
నిమ్మగడ్డ వ్యవహారంలో ఏపీ సర్కారుపై వస్తోన్న విమర్శలకు మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వానికి న్యాయ స్థానాల పట్ల గౌరవం, నమ్మకం ఉన్నాయనన్నారు. అయితే, అసలీ కేసులో టీడీపీ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ‘‘ఇంగ్లీష్ మీడియం నుంచి పేదలకు ఇళ్ల దాకా అన్నింటిపైనా కోర్టు స్టే తెస్తారు.. పట్టపగలు తప్పతాగి తిరిగితే.. దానిపై విచారణలకు ఆదేశాలు ఇప్పిస్తారు. ఇదేనా టీడీపీ విధానం? ఇవన్ని హర్షించే విషయాలేనా?''అని బొత్స మండిపడ్డారు.












Click it and Unblock the Notifications