బాబుకు షాక్: జంప్ జిలానీల సరికొత్త వ్యూహం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరిన తెలంగాణ తెలుగుదేశం తిరుబాటు ఎమ్మెల్సీలు సరికొత్త వ్యూహరచన చేశారు. శాసన మండలిలో టిడిపి ఎమ్మెల్సీల విభాగానికే ఎసరు పెట్టబోతున్నారు. తెలంగాణ శాసనమండలిలో టిడిపికి ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. వారిలో ఐదుగురు తెరాసలో చేరారు.
బి. వెంకటేశ్వర్లు, బి. లక్ష్మీనారాయణ, పట్నం నరేంద్రరెడ్డి, గంగాధరం గౌడ్, మహ్మద్ సలీం ఇటీవలే తెరాసలో చేరారు. మొత్తం ఏడుగురిలో మెజార్టీ సభ్యులు అయిన ఐదుగురు సోమవారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తెలంగాణ .టీడీపీ మండలి విభాగాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తీర్మానం చేసి, తీర్మానం కాపీని మండల ఛైర్మన్ స్వామిగౌడ్కు అందజేశారు.
షెడ్యూల్ పదిలోని 4వ పేరాకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు. రెండు రోజుల్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్న సమయంలో తెలంగాణ టిడిపి జంప్ జిలానీలు వేసిన ఈ ఎత్తుగడ రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకే ఈ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.
గతంలో కాంగ్రెసు తెలంగాణ ఎమ్మెల్సీలు కొంత మంది తెరాసలో చేరారు. వారి సాయంతో శాసనమండలి చైర్మన్ పదవిని తెరాస కైవసం చేసుకుంది. తెరాసకు చెందిన స్వామి గౌడ్ చైర్మన్గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి కూడా తెరాస నాయకత్వం తెలుగుదేశం, కాంగ్రెసు శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు ఎర వేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా పలువురు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు తెరాసలో చేరారు. ఇతర పార్టీల ఎమ్మెల్సీలను చేర్చుకోవడం ద్వారా శాసన మండలిలో తెరాస పూర్తి ఆధిక్యంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది.
ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 6,7,8 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను ఆయన ఆయన కలుస్తారు. శ్రీశైలం జలవివాదం, రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10లోని ఉమ్మడి సంస్థల విభజన తదితర అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. తుఫాను బాధితులకు సాయం కోసం పారిశ్రామికవేత్తలను చంద్రబాబు కలుస్తారు.