చీలిన కాంగ్: 'ఢీ'పై కిరణ్ వర్గం ఆరా, అధిష్టానం ఆశీస్సు!
రెండు రోజుల క్రితం మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గంటా శ్రీనివాస రావుల నివాసంలో వేర్వేరుగా సమావేశాలు జరిగాయి. బుధవారం మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్సలతో సీమాంధ్ర కాంగ్రెసులో రాజకీయ వేడి రాజుకుంది. రాష్ట్ర విభజనపై అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి వర్గం ఒకటి, ముఖ్యమంత్రిని వైఖరిని వ్యతిరేకిస్తూ, అధిష్ఠానానికి జై కొడుతూ 'సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ కాంగ్రెస్' అంటూ రెండో వర్గం చెబుతోంది.
ఢీ అంటే ఢీ అంటూ రెండు వర్గాలు తలపడుతున్నాయి. అధిష్ఠానం ఆశీస్సులతోనే కిరణ్ వ్యతిరేకవర్గం విజృంభిస్తున్నట్లు భావిస్తున్నారు. రాష్ట్ర విభజనపై తాము తీసుకున్న నిర్ణయం అమలుకు సహకరించకుండా, కొరకరాని కొయ్యలా మారిన కిరణ్పై అధిష్ఠానం పెద్దలు ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నారు. కిరణ్ వ్యతిరేక వర్గం ఇప్పడు వరకు ఆయనపై పరోక్ష వ్యాఖ్యలు చేసినా ఇప్పుడు నేరుగా విరుచుకపడుతోంది.
బుధవారం డొక్కా మీడియా ముందుకు వచ్చి కిరణ్పై సూటి విమర్శలు చేయడం గమనార్హం. 'సేవ్ ఆంధ్రప్రదేశ్- సేవ్ కాంగ్రెస్' అంటూ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సహా కొందరు మంత్రులు అధిష్ఠానానికి జై కొడుతున్నారు. సిడబ్ల్యూసి నిర్ణయం శిలా శాసనం కాదంటున్న ముఖ్యమంత్రి శిబిరంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, ఎంపి లగడపాటి రాజగోపాల్ తదితరులున్నారు. తాము ప్రజల పక్షమని, అంతిమ విజయం తమదేనని చెబుతున్నారు.
గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. తాజా పరిణాల నేపథ్యంలో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర విభజన, అధిష్ఠానం పట్ల అనుసరించాల్సిన వైఖరిపై ఎవరి వాదనలు ఏమిటో బహిర్గతం కానున్నాయి. కాగా, డొక్కా వ్యాఖ్యలు కలకలం సృష్టించగా, ఆ వ్యాఖ్యలపై వారు కూపీలాగుతున్నారట.