భూమాకు 'ప్రైవేటు' వైద్య సేవలు: వివరణ కోరిన డీఐజీ
కర్నూలు: నంద్యాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు భూమా నాగిరెడ్డిని ప్రయివేటు ఆసుపత్రికి తరలించడం పైన జైళ్ల శాఖ డీఐజీ వివరణ కోరినట్లుగా తెలుస్తోంది. భూమాకు ప్రయివేటు ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడం పైన కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన డీఐజీ నంద్యాల సబ్ జైలు సూపరిండెంటును ఈ విషయమై వివరణ కోరారు.
విదేశీ మరకద్రవ్యం అవసరం: జేపీ
దేశానికి విదేశీ మరకద్రవ్యం అవసరమని అందుకు తాను ఎఫ్డీఐలకు మద్దతు ఇస్తున్నట్లు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ ఆదివారం అన్నారు. హైదరాబాద్లోని కేపీహెచ్పి కాలనీలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఫోటోల కోసం ఫోజులు కాకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహించాలని, అప్పుడే స్వచ్ఛ భారత్ సాధ్యమన్నారు.
కేసీఆర్ వైఖరే కారణం: లక్ష్మణ్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్ ఆదివారం మండిపడ్డారు. కేంద్రంతో కేసీఆర్ చర్చలు జరపకుండా సహకరించడం లేదని అనడం సరికాదన్నారు. కేసీఆర్ తీరు.. చేపలు పట్టడం చేతకాక సముద్రాన్ని నిందించినట్టు ఉందని ఎద్దేవా చేశారు.
ఆదివారం బీజేఎల్పీ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ వైఖరే కారణమని ఆయన దుయ్యబట్టారు.
ఎన్నికల హామీలకు అనుగుణంగా ప్రభుత్వం పనితీరు కొనసాగడంలేదని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి మొత్తం రాష్ట్ర ప్రజలను కలవరపరుస్తోందన్నారు. విద్యుత్ కోతలు, రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీ, కరువుపై ప్రభుత్వం అవలంభించిన వైఖరి తదితర వాటిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
కృష్ణా రివర్ బోర్డు తీర్పుకు కేంద్రాన్ని నిందించడం సరికాదన్నారు. ఛత్తాస్గడ్తో విద్యుత్ ఒప్పందంపై ఎందుకు జాప్యం చేశారని లక్ష్మణ్ ప్రశ్నించారు. కేసీఆర్కు పాలన కంటే పార్టీ పటిష్టతే ముఖ్యమా? అని ప్రశ్నించారు.
60 శాతం నిధులు సంక్షేమ పథకాలకే: యనమల
రాష్ట్ర బడ్జెట్లో 60 శాతం నిధులను సంక్షేమ కార్యక్రమాలపై వెచ్చిస్తున్నట్లు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తూర్పు గోదావరి జిల్లాలోని సర్పవరంలో తెలిపారు. స్థానికంగా జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రైతు రుణమాఫీకి రూ.30వేల నుండి రూ.40వేల కోట్లు, డ్వాక్రా రుణమాఫీకి రూ.7వేల కోట్లు, పింఛన్లకు రూ.5,500 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు.