ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యపై డీఐజీ, చంద్రబాబు అత్యవసర సమీక్ష
విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్యలపై విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. గ్రామదర్శిని కార్యక్రమానికి వెళ్తుండగా దాదాపు 20 మంది మావోయిస్టులు మధ్యాహ్నం 12 గంటల సమయంలో వారి వాహనాలను అడ్డుకున్నారని చెప్పారు. పిస్తోళ్లు, ఆయుధాలు లాక్కున్నారని చెప్పారు.
భౌతికకాయాలను కేజీహెచ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. సంఘటన జరిగిన ప్రాంతం ఒడిశా బార్డర్కు 15 కిలోమీటర్ల దూరంలోనే ఉందని చెప్పారు. ఘటన స్థలంలో 10మంది ఆయుధాలతో కనిపించారని తెలిసిందన్నారు. ఘటన జరిగిన పరిణామాలపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. పూర్తిస్థాయిలో విచారించాక తెలుస్తుందని, ఇప్పటికి ఇది ప్రాథమికంగా తెలిసిందే అన్నారు. మావోయిస్టుల వద్ద ఎవరూ బందీలుగా ఉన్నట్లు తెలియదన్నారు.

తహసీల్దారు కార్యాలయానికి 3 కిలోమీటర్ల దూరంలో
ఈ ఘటన డుంబ్రీగూడ తహసీల్దారు కార్యాలయానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే జరిగినట్లుగా తెలుస్తోంది. గన్మెన్ల వద్ద ఉన్న 9ఎంఎంలు, పిస్తోలులు లాక్కున్నారు. విషయం తెలియగానే ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఇంచార్జ్ డీజీపీ హరీష్ గుప్తా సంఘటన స్థలానికి బయలుదేరారు. ఇది ఊహించని సంఘటన అని చినరాజప్ప అన్నారు.
మరోవైపు, ఘటన వివరాలను సీఎంవో అధికారులు సీఎస్కు వివరించారు. గ్రామదర్శినిలో పాల్గొనే నేతలకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతలను పర్యవేక్షించాలని హరీష్ గుప్తాకు సూచించారు.
శాంతిభద్రతలపై చంద్రబాబు అత్యవసర సమీక్ష
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన సాయంత్రం అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. న్యూయార్క్ చేరుకోగానే సంఘటనపై సమీక్షిస్తారు. కాగా, ఎమ్మెల్యే వాహనంలోనే భౌతికకాయాలను తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications