హామీ ఇచ్చారు, గుర్తుంచుకోండి: డిగ్గీ, కిరణ్ వ్యాఖ్యపై నో
హైదరాబాద్: తెలంగాణపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నాయకులు హామీ ఇచ్చారని, దానిని వారు గుర్తు పెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ సోమవారం న్యూఢిల్లీలో అన్నారు.
రాజీనామాలపై ఎవరు తొందరపడవద్దన్నారు. సీమాంధ్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని చెప్పారు. విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ, విద్యాసంస్థలు ఇవ్వాలన్న కేంద్రమంత్రి పనబాక లక్ష్మి డిమాండును తాను స్వాగతిస్తున్నానని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.
సీమాంధ్రకు ఏం చేయాలో తమ డిమాండ్లు వినిపించాలే తప్ప తొందరపడి రాజీనామాలు చేయవద్దన్నారు. అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం పైన ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. తెలంగాణపై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అపాయింటుమెంటును కోరినట్లు చెప్పారు. ఆయనను కలిశాక స్పష్టత ఇస్తానని చెప్పారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించని డిగ్గీ
ఫైలిన్ తుఫానును ఆపలేకపోయిన తాను విభజన తుఫానును ఆపేస్తానన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించేందుకు దిగ్విజయ్ నిరాకరించారు.
రాజీనామా కోసం లగడపాటి
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సోమవారం మరోసారి తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఇందుకోసం ఆయన స్పీకర్ కార్యాలయానికి బయలుదేరారు.