సంతోషంగా లేను: కిరణ్పై డిగ్గీ సీరియస్, అసహనం
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పైన చేసిన వ్యాఖ్యల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ అసహనం ప్రదర్శించారు. ఎప్పుడు విలేకరులతో నవ్వుతూ మాట్లాడే అతను కిరణ్ వ్యాఖ్యలతో సీరియస్గా స్పందించారు.
ఆయన ఎపికి ముఖ్యమంత్రి అని, రాష్ట్రం ఇంకా విడిపోలేదని, అందువల్ల ఆయన 2009లో కాంగ్రెసును ఎన్నుకున్న ప్రజలందరికీ ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని చురకలేశారు. కిరణ్ మాటల పట్ల తాను సంతోషంగా లేనని, ఏం చేయాలో, ఏం చర్యలు తీసుకోవాలో తాము ఆలోచిస్తున్నామని పరోక్షంగా అన్నారు. రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయానికి వస్తామన్నారు.

మీరు ఆయనను సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా సంభోదించిన ప్రతిసారి మరింత ఉత్సాహం వస్తుందని కిరణ్ చెబుతున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ప్రస్తుతం రాష్ట్రం విడిపోలేదన్నారు. అధిష్టానం తీసుకోబోయే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన సీనియర్ కాంగ్రెసు నేతలు అందరూ అంగీకరించారన్నారు.
ఆ తర్వాతే సిడబ్ల్యూసిలో నిర్ణయం తీసుకున్నామన్నారు. తమ లాంటి జాతీయ పార్టీలు ఒకసారి తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కు వెళ్లలేవన్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లాంటివి వెనక్కు పోవచ్చునని కానీ, తాము వెళ్లలేమన్నారు. అదే సమయంలో కిరణ్ ఏం మాట్లాడారో తనకు అర్థమయ్యే భాషలో తర్జుమా చేయించుకొని తెప్పించుకుంటానని, ఆ తర్వాతే స్పందిస్తానని డిగ్గీ చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications