కిరణ్తో చెప్పా, చర్చ పూర్తయితే నెరవేరుస్తాం: దిగ్విజయ్
న్యూఢిల్లీ: తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడానని, చర్చ పూర్తయితే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని తాము నిలబెట్టుకుంటామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ శుక్రవారం న్యూఢిల్లీలో చెప్పారు. బిల్లు పైన చర్చ వీలైనంత త్వరగా ముగించాలన్నారు. కిరణ్తో మాట్లాడానని, వీలైనంత త్వరగా బిల్లుపై చర్చ ముగించాలని చెప్పానని తెలిపారు.
కాగా, ముఖ్యమంత్రి తో తాను తెలంగాణ ముసాయిదా బిల్లు పైన మాట్లాడుతానని దిగ్విజయ్ సింగ్ గురువారం చెప్పిన విషయం తెలిసిందే. తనను కలిసేందుకు కిరణ్ శుక్రవారం ఢిల్లీకి వస్తున్నారని ఆయన చెప్పారు. కిరణ్తో తెలంగాణ బిల్లు విషయమై మాట్లాడుతానని చెప్పారు.
మరోవైపు కిరణ్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు దూరంగా ఉన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో ముఖ్యమంత్రి పార్టీ అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. ఆయన పార్టీ పెడతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్న కిరణ్ పలుమార్లు ఢిల్లీకి వెళ్లలేదంటున్నారు.
ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కోసం ఢిల్లీకి వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, కిరణ్లు శుక్రవారం ఢిల్లీ వెళ్లి రాజ్యసభ అభ్యర్థులపై అధిష్టానం పెద్దలతో చర్చించవలసి ఉంది. అయితే, కిరణ్ మాత్రం ఢిల్లీ వెళ్లడం లేదు. శాసన సభ సమావేశాలు ఉన్నందున ఢిల్లీ రాలేదని కిరణ్ కుమార్ రెడ్డి ఎపి కాంగ్రెసు వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్కు ఫోన్ చేసి చెప్పారు.