ఏపీకీ హోదా కావాలంటే.. టిడిపి ఇలా చేయాలి: దిగ్విజయ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ నాటకాలాడుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ట్విట్టర్ వేదికగా దిగ్విజయ్ సింగ్.. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే ఆ బిల్లును అడ్డుకోవడంలో ఎన్డీఏ విజయవంతమైంది.
ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కేంద్రంగా దేశవ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా స్పందించిన దిగ్విజయ్ సింగ్.. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో టీడీపీకి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.
Though People of AP punished us by not sending a single Congress MLA/MP we have forced BJP/TDP Alliance to re think about the Special Status
— digvijaya singh (@digvijaya_28) 31 July 2016
ఇప్పటికైనా టీడీపీ తన నాటకాలన్నింటినీ కట్టిపెట్టి ఎన్డీఏ నుంచి బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని కూడా డిగ్గీరాజా వ్యాఖ్యానించారు. అంతకుముందు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఏపీ హోదా కోసం తాము చేస్తున్న పోరాటానికి సహకరించాలని కోరారు.