కెసిఆర్ను నమ్ముతా: దిగ్విజయ్, విజయశాంతి భేటీ
న్యూడిల్లీ: తాము తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును నమ్ముతామని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. తమకు ఇచ్చిన హామీ మేరకు తెరాసను తమ పార్టీలో విలీనం చేస్తారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
కాంగ్రెసులో తమ పార్టీ విలీనం కాదని, పొత్తు కూడా పెట్టుకోదని తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు చేసిన వ్యాఖ్యలను తాను పట్టించుకోబోనని ఆయన అన్నారు. త్వరలో లోకసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని, జాబితా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పనిచేయడానికి తగినంత సమయం కూడా లేదని, త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం సమతుల్యతతో తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, అపాయింట్ డేనాటికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పనిచేసే విధంగా చూడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అపాయింటెడ్ డే రావడానికి రెండు నుంచి మూడు నెలలు పట్టవచ్చునని ఆయన అన్నారు.
రాష్ట్రపతి పాలన విధింపుపై కేంద్ర మంత్రివర్గం రేపు శుక్రవారం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. తెరాస శాసనసభ్యుడు అరవింద్ రెడ్డి కాంగ్రెసు పార్టీలో చేరడంపై మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా తెరాస విలీనమైతే అందరం ఒక్కటవుతామని ఆయన అన్నారు. కాగా, తెరాస నుంచి సస్పెండైన మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి దిగ్విజయ్ సింగ్ను కలిశారు.












Click it and Unblock the Notifications