దిల్ రాజు 'రాజకీయం'... చిరంజీవి, బాలకృష్ణకు 'నో సౌండ్'?
విజయ్ కథానాయకుడిగా దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు సినిమా వివాదం రోజురోజుకు ముదురుతోంది. తెలుగులో వారసుడు, తమిళంలో వారిసుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో దిల్ రాజు భారీసంఖ్యలో థియేటర్లను బ్లాక్ చేసినట్లు సమాచారం.
దీంతో చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. దిల్ రాజు ఎగ్జిబిటర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్రాంతి లాంటి పెద్ద పండగలకు డబ్బింగ్ సినిమాలు విడుదల చేయవద్దని తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖ విడుదల చేసింది.
థియేటర్లు మిగిలితేనే డబ్బింగ్ సినిమాలకు..
సంక్రాంతి సెలవులు తెలుగు సినీ పరిశ్రమకు బాగా కలిసివస్తాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి, తమ సినిమాను లాభాలబాట పట్టించడానికి సాధ్యమైనంతమంది నిర్మాత, దర్శకులు సంక్రాంతికే విడుదల చేయాడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. రాబోయే సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి విడుదల కాబోతున్నాయి. అయితే అదే సంక్రాంతికి తమిళంలో వారిసు విడుదలవుతోంది.
వారసుడిని డబ్బింగ్ చేసి విడుదల చేస్తానన్న దిల్ రాజు ప్రకటనపై విమర్శలు వచ్చాయి. ఇదే దిల్ రాజు 2019లో చేసిన ప్రకటనను ప్రస్తావించారు. ప్రాంతీయ చిత్రాలకే తొలి ప్రాధాన్యత అని, థియేటర్లు ఎక్కడైనా మిగిలితేనే డబ్బింగ్ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలనేది ఆ ప్రకటన సారాంశం.
విద్వేషాలు రగిలే ప్రమాదముంది
నామ్ తమిళర్ పార్టీ అధినేత సీమాన్ స్పందించారు. తెలుగు సినీ నిర్మాతల సంఘం చేసిన ప్రకటన విస్మయానికి గురిచేస్తోందన్నారు. తమ రాష్ట్రంలో లెక్కలేనని తెలుగు సినిమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా విడుదలవుతున్నాయని, ఇప్పుడు తమిళ చిత్రాలపై ఆంక్షలు విధిస్తూ తీసుకున్న నిర్ణయం తప్పన్నారు. తాము ఎప్పుడూ భాషా వివక్షచూపించలేదన్నారు. ఇంత జరుగుతుంటే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఏం చేస్తోందని దర్శకుడు లింగుస్వామి ప్రశ్నించాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భాషాపరంగా తెలుగు, తమిళ పరిశ్రమల మధ్య విద్వేషాలు వచ్చే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎవరి సినిమాను ఎవరూ అడ్డుకోలేరు..
అయితే తాము తమిళ సినిమాలను అడ్డుకుంటామని అనలేదని, తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇస్తామని మాత్రమే చెప్పామని తెలుగు సినీ నిర్మాతల మండలి వివరణ ఇస్తోంది. టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ సినిమాలను ఎవరూ అడ్డుకోలేరని .. ఇది సాధ్యం కాదని, సినిమా బాగుంటే ఎక్కడైనా ఆడుతుందని.. సినిమాకు ఎల్లలు లేవని.. సౌత్, నార్త్ అనే విభేదాలు తొలగిపోయాయన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ అందరిదీ అని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. రోజురోజుకు వారసుడు చిత్రానికి సంబంధించిన వివాదం ముదురుతుండటంతో సంక్రాంతి బరి నుంచి తన సినిమాను దిల్ రాజు తప్పిస్తారా? లేదా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.