వీరసింహారెడ్డి ఫ్లెక్సీపై ఆ వైసీపీ ఎమ్మెల్యే ఫొటో- పార్టీ మార్పు ప్రచారం నేపథ్యంలో..!
ఆయన వైసీపీ నుంచి తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే. తన సొంత నియోజకవర్గం పార్టీ వ్యవహారాల్లో ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలంతా వేలు పెడుతున్నారు. దీంతో తొలుత లైట్ తీసుకున్న ఆయనకు ఆ తర్వాత చుక్కలు కనిపించసాగాయి. అధిష్టానం జోక్యం చేసుకుని వారిస్తుందేమోనని చూశారు. కానీ అలా జరగలేదు. దీంతో ఈ మధ్య రాజకీయాలపైనే వైరాగ్యంతో కనిపిస్తున్న సదరు ఎమ్మెల్యే త్వరలో పార్టీ మారడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం ఆ విషయం తప్ప అన్నీ మాట్లాడుతున్నారు. ఇంతలో మరో ఘటన జరిగింది.
ఇవాళ బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలోని అభిమానులు ఫ్లెక్సీలు కట్టారు. అంతవరకూ బాగానే ఉన్నా ఆ ఫ్లెక్సీలపై ఎమ్మెల్యే అయిన తన ఫోటో కూడా పెట్టారు. అసలే వైసీపీలో అంతర్గత వివాదాలతో సతమతం అవుతున్న ఆయన... పార్టీ మారడం ఖాయమని అంతా అనుకుంటున్న తరుణంలో ఇలా ఫ్లెక్సీపై కనిపించే సరికి ఆ అనుమానాలు నిజం కాబోతున్నాయా అన్న చర్చ సాగుతోంది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో చోటు చేసుకుంది. ఇలా వైసీపీలో అవమానాలు ఎదుర్కొంటూ వీరసింహారెడ్డి ఫ్లెక్సీపై చేరిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.

మైలవరం వైస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఫోటోతో కూడిన బాలకృష్ణ వీరసింహారెడ్డి ఫ్లెక్సీ ఇవాళ
నియోజకవర్గంలోని జీ.కొండూరు మండలం వెలగలేరు గ్రామంలో కనిపించింది. ఇప్పటికే మైలవరం ఎమ్మెల్యే వసంతపై పలు అనుమానాలతో ఉన్న వైసీపీ నేతలు...ఈ ఫ్లెక్సీ చూసి మండిపడుతున్నారు. టీడీపీలోకి వెళ్లిపోతారని గత కొద్ది నెలలుగా ప్రచారం నేపథ్యంలో ఈ ఫ్లెక్స్ కీలకంగా మారింది. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మంట రేపుతోంది. వాస్తవానికి తన తండ్రి వసంత నాగేశ్వరరావు సైతం ఈ మధ్య కృష్ణప్రసాద్ పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ ఫ్లెక్సీ వివాదంతో మళ్లీ రూమర్లు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications